
బనకచర్ల గేమ్ ఛేంజర్ కాదు
రాయచోటి టౌన్ : బనకచర్ల గేమ్ ఛేంజర్ కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టే ప్రాజెక్టు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే బనకచర్ల గేమ్ఛేంజర్ అని మాట్లాడుతున్నారన్నారు. గేమ్ ఛేంజర్ అంటే ఏమిటి.. ? దీని వలన ప్రజలకు ఏమి మేలు జరుగుతుందనే ఆలోచన నాయకులకు లేదా అని ప్రశ్నించారు. బనక చర్ల క్రాస్కు రూ.85 వేల కోట్లతో టెండర్లు పిలుస్తామని చంద్రబాబు చెబుతున్నారన్నారు. బనక చర్ల క్రాస్కు పోలవరం నుంచి రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి నీళ్లు వదిలితే ఇక్కడ కొత్తగా ఆయకట్టు పెరుగుతుందా అని అడిగితే సమాధానం లేదన్నారు. ఆయకట్టు స్థిరీకరిస్తున్నారా అని అడిగినా స్పందన లేదన్నారు. రాజధానిలో భవన నిర్మాణాల కోసం అడుగుకు రూ.12000 నుంచి 15000ల మధ్య రేటుతో టెండర్లు పిలవడం చూస్తే ఎంత ప్రజాధనం వృథా అవుతుందో తెలుస్తుందన్నారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఈ రకమైన దోపిడీ చేయడం సరైనదేనా అని అడుగుతున్నామన్నారు.
రాయచోటి ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎంతో కష్టపడి ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, పీవీ మిథున్రెడ్డిల సహకారంతో 45 శాతం పనులు పూర్తి చేయించామన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయమంటే పలికే వారు లేరన్నారు. రాజధాని పే రుతో జరుగుతున్న అవినీతిని బయటకు రానీయ కుండా దృష్టి మరల్చేందుకే చంద్రబాబు బనకచర్ల క్రాస్ను తెరపైకి తెచ్చారన్నారు. చంద్రబాబు నా యుడుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగు ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం ఇవ్వడం లేదన్నారు. వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారని అది ప్రజాస్వామ్యంలో జరగదన్నారు. ఎఎవరికీ అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు.
జిల్లా కేంద్రం ఏర్పాటుకు కృషి చేశా..
తొలుత తాను ఎమ్మెల్యే అయినప్పుడు గల్లా అరుణ కుమారి ద్వారా రూ.60 కోట్లతో రాయచోటిలో రింగ్ రోడ్డును నిర్మింపచేశానన్నారు. దాంతో రూ.15 వేల కోట్ల రియల్ ఎస్టేట్ జరిగిందని, అది సంపద సృష్టి అన్నారు. తహసీల్దార్ స్థాయిలో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే మాటలు కాకుండా ప్రతిపక్షం అడుతున్న వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రహిమాన్, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు రమేష్, పట్టణ అధ్యక్షుడు నవాజ్, ఎస్పీఎస్ రిజ్వాన్, కౌన్సిలర్లు గౌస్ఖాన్, అల్తాఫ్, సుగవాసి ఈశ్వర్ప్రసాద్, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, మేధావుల ఫోరం నియోజక వర్గం అధ్యక్షుడు జానం రవీంద్ర యాదవ్, ఖలీల్, చిన్నమండెం సుక్కా అంజనప్ప తదితరరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్రెడ్డి