పంజంకు కన్నీటి వీడ్కోలు! | - | Sakshi
Sakshi News home page

పంజంకు కన్నీటి వీడ్కోలు!

Jun 29 2025 2:41 AM | Updated on Jun 29 2025 2:41 AM

పంజంక

పంజంకు కన్నీటి వీడ్కోలు!

సాక్షి రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్‌: వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి (64)కి పార్టీ నేతలు, శ్రేణులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆప్యాయంగా పలుకరించడమే కాకుండా నవ్వుతూ మాట్లాడే పంజం సుకుమార్‌రెడ్డిని తలుచుకుని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్యంతో చైన్నెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసిందే. శనివారం ఉదయం అంత్యక్రియుల నిర్వహించారు. అంతకుముందు అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, తిరుపతితో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి నివాళి అర్పించారు. పంజం కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

నేతల నివాళి

రైల్వేకోడూరు మండల పరిధిలోని అనంతరాజుపేట పంచాయతీ తూర్పుపల్లిలో పంజం సుకుమార్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న పార్టీ కీలక నేతలు నివాళులర్పించారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, కడప పార్లమెంట్‌ పరిశీలకులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి, ఆర్టీసీ మాజీ రాష్ట్ర చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ధ్వజారెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ సలహాదారుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి మృతి చెందారన్న విషయం తెలుసుకుని శుక్రవారం రైల్వేకోడూరుకు వచ్చిన సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనుంజయరెడ్డి పంజం సుకుమార్‌రెడ్డి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సుకుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పంజం సందీప్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే జనసేన, టీడీపీ నాయకులు కూడా పంజం సుకుమార్‌రెడ్డికి నివాళులర్పించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, టీడీపీ నాయకురాలు ముక్కా వరలక్ష్మి కూడా నివాళులర్పించారు.

ఘనంగా అంతిమ వీడ్కోలు

తూర్పుపల్లిలోని పంజం సుకుమార్‌రెడ్డి ఇంటి వద్ద నుంచి అంతిమ యాత్ర సాగింది. పార్టీ శ్రేణులు, నేతలు, గ్రామస్తులు, కుటుంబీకులు భారీగా పాల్గొన్నారు. ఇంటి వద్ద నుంచి పంజం సుకుమార్‌రెడ్డి వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

పార్టీపట్ల నిజాయితీ కలిగిన నాయకుడు: మాజీమంత్రి పెద్దిరెడ్డి

సీనియర్‌ నాయకులు పంజంసుకుమార్‌రెడ్డి మృతి చెందడం భాదాకరమని, అలాగే తను నమ్మిన పార్టీ, వైఎస్‌ఆర్‌ కుటుంబం పట్ల నిజాయితీకలిగిన నాయకుడని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సుకుమార్‌రెడ్డి రాజకీయాల్లో ఉన్ననాటి నుంచి తనకు పరిచయం ఉందని తెలిపారు. పార్టీ పటిష్టతకు నిబద్ధతతో పని చేసేవాడని తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ, అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండదండలు అన్ని వేళలా ఉంటాయని తెలిపారు.

కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు

సుకుమార్‌రెడ్డి పార్థివదేహం వద్ద నివాళులర్పించిన పెద్దిరెడ్డి, అంజద్‌బాషా తదితరులు

పంజంకు కన్నీటి వీడ్కోలు! 1
1/2

పంజంకు కన్నీటి వీడ్కోలు!

పంజంకు కన్నీటి వీడ్కోలు! 2
2/2

పంజంకు కన్నీటి వీడ్కోలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement