
●హార్సిలీహిల్స్ బాబాదే
పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ను యోగాగురువు రాందేవ్ బాబాకు ఇచ్చేసినట్టే అన్న సంకేతాలను సీఎం చంద్రబాబు ఇచ్చేశారు. హార్సిలీహిల్స్కు చరిత్ర ఉంది, రాందేవ్ బాబా వెల్నెస్ సెంటర్ ప్రారంభిస్తే అందుకు అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పిస్తానని ఆయనను ఉద్దేశించి ప్రకటించారు. ఏప్రిల్ 14న పతంజలి ప్రతినిధులు హార్సిలీహిల్స్లో పర్యటించి వెళ్లాక రాందేవ్ బాబా స్వయంగా ఈనెల 25న హార్సిలీహిల్స్ వచ్చి బాగుంది ప్రపంచ స్థాయి వెల్నెస్ సెంటర్ ప్రారంభిస్తామని ప్రకటించి..హార్సిలీహిల్స్ నచ్చేసిందని నేరుగానే చెప్పేశారు. ఇక్కడినుంచి వెళ్లిన రెండోరోజే చంద్రబాబు సమక్షంలో హార్సిలీహిల్స్ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తానని రాందేవ్ బాబా చెప్పడం, దానికి చంద్రబాబు కొనసాగింపుగా వెవెల్నెస్ సెంటర్ కోసం అన్ని వసతులు కల్పించడమేకాక మినీ విమానాశ్రయం కూడా కడతానని అడక్కనే వరం ఇచ్చేశారు. దీంతో త్వరలోనే హార్సిలీహిల్స్ పతంజలి ఖాతాలోకి జమకావడం ఖాయమైపోయింది.
మదనపల్లె: ఉట్టికి ఎగరలేదుకాని స్వర్గానికి నిచ్చెన వేసిందనేది సామెత. ఇప్పుడీ సామెత సీఎం చంద్రబాబుకు సరిగ్గా అతుకుతుంది. కరువు, పంటలకు గిట్టుబాటు ధర లేదు, పెట్టిన పెట్టుబడిలో పైసా తిరిగి పొందక రైతులు వందల కోట్లు నష్టపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. రైతు సమస్యలను కనీసం పట్టించుకోని సీఎం చంద్రబాబు మదనపల్లెకు మినీ విమానాశ్రయం కడతానంటూ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం జరిగిన టూరిజం పెట్టుబడుల సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు మదనపల్లె ప్రాంతం ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు, రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా ఇక్కడికి మినీ విమానాశ్రయం తెస్తానని ప్రకటించడం పక్కా వ్యాపార దృక్ఫథంతో వ్యవహరిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. శాశ్వత కరువును పారదోలడంపై ఏనాడూ సమీక్షించని చంద్రబాబు బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ను రాందేవ్ బాబాకు ఇచ్చేందుకు, ఆయన కోసమే అన్నట్టుగా మదనపల్లెలో మినీ విమానాశ్రయం కడతానంటూ గొప్పగా ప్రకటించడంపై మేధావులు, కార్మిక నేతలు మండిపడుతున్నారు. మదనపల్లె డివిజన్ రైతులు ఏడాదికాలంలో పండించిన దోస, కర్భూజ, టమాట, వేరుశెనగ, అల్లనేరేడు, మామిడి, వంగ పంటలకు కనీస ధర లేదు. ప్రతిపంటలోనూ తీవ్ర నష్టాలు చవిచూశారు. వీటిపై స్పందించని సీఎం చంద్రబాబు వ్యాపార సంస్థల కోసం విమానాశ్రయం తెస్తాననడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అవసరం లేకున్నా...
2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు మదనపల్లెలో పర్యటించి ఇక్కడ విమానాశ్రయం కడతానని ప్రకటించారు. ఇక్కడ విమానాశ్రయం కట్టాల్సినంతటి అవసరం లేదు. ఆ స్థాయిలో ఫ్యూజిబులిటీ కూడా లేదు. ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ, 130 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట అంతర్జాతీయ, 120 కిలోమీటర్ల దూరంలో కడప విమానాశ్రయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడి ప్రజల చెవుల్లో పూవ్వులు పెట్టేందుకు ప్రయత్నించి విమానాశ్రయం పెడతానంటూ ప్రకటించారు. దీనిపై జోకులు వేసుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించారు. అయితే ఈ మారు బాబా రాందేవ్ కోసమే అన్నట్టు ఆయన సమక్షంలో మదనపల్లెకు మినీ విమానాశ్రయం కడతానంటూ ప్రకటించారు. మదనపల్లె (హార్సిలీహిల్స్) అంతర్జాతీయ స్థాయి వెల్నెస్ సెంటర్గా అభివృద్ధి చెందాలని, అందుకు మినీ విమానాశ్రయం తెస్తామని, ఎవరూ అడక్కపోయినా, దాని అవసరం లేకపోయినా ప్రకటించి అందర్ని విస్తుపోయేలా చేశారు. మదనపల్లె చుట్టూ మూడు విమానాశ్రయాలు ఉన్నా, ఇక్కడికి విమానాశ్రయం అవసరం లేకున్నా మళ్లీ ఆదే పాట పాడిన చంద్రబాబు వ్యాపార సంస్థల కోసమే ఈ మాటను లెవనెత్తారు. దీనివల్ల సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులు ఒరిగేదేమి లేదు.
రైతుల నోట్లో మట్టికొట్టి..
మదనపల్లెకు విమానాశ్రయం అంటున్న సీఎం చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన రైతాంగ సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి రైతుల నోట్లో మట్టి కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రూ.8,175,91 కోట్ల విలువైన మదనపల్లె డివిజన్కు చెందిన సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసి రైతులకు తీరని ద్రోహం చేశారు. రూ.759.50 కోట్ల ముదివేడు ప్రాజెక్టు, రూ.1,217.49 కోట్ల పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులు నిలిపివేత, రూ.4,373.23 కోట్ల గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టు అనుసంధానం పనులు రద్దు, రూ.1,825.69 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని రద్దు చేసి ప్రజల, రైతుల అభివృద్ది ఆకాంక్షలపై నీళ్లు చల్లారు.
2014–19లో ఇచ్చిన హామీల్లో కొన్ని..
రైతుల కష్టాలకు దిక్కులేదు.. మదనపల్లెకు విమానాశ్రయమట
2019 ఎన్నికలకు ముందు ఇదేపాట పాడిన వైనం
ఇప్పుడు మినీ ఏయిర్పోర్ట్ కడతానని ప్రకటన
పారిశ్రామికాభివృద్ధి కోసం బెంగుళూరు నుంచి అనంతపురంజిల్లా మీదుగా తంబళ్లపల్లె మదనపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలను కలుపుతూ రింగ్ రోడ్ నిర్మాణం.. జిల్లాలో పాడిరైతుల ద్వారా 50 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి పెంచేలా ప్రణాళిక.. హర్టికల్చర్ హబ్గా తంబళ్లపల్లె.. పల్లెల్లో 400 నుంచి 500 పశువులకు వసతికి పశువుల హాస్టళ్లు, బయోగ్యాస్ ఉత్పత్తి.. తంబళ్లపల్లె టమాట రైతులకు రూ.10కోట్ల ప్యాకేజీ.. టమాట ఆధారిత పరిశ్రమను స్థాపనకు పెప్సికో కంపెనీతో సంస్థల ఏర్పాటు.. కురబలకోట మండలంలోని హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఐటీ సంస్థలను స్థాపన. ఇలా పదుల సంఖ్యలో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదు.

●హార్సిలీహిల్స్ బాబాదే

●హార్సిలీహిల్స్ బాబాదే