
క్వాంటమ్ కంప్యూటింగ్ జీవన విధానాన్ని మార్చే టెక్నాలజీ
కురబలకోట : క్వాంటమ్ కంప్యూటింగ్ జీవన విధానాన్ని మార్చే టెక్నాలజీ కాగలదని పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ బి. సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అనంతపురం జేఎన్టీయూతో కలసి క్వాంటమ్ న్యూరో మార్పిక్ కంప్యూటింగ్ ఫర్ సస్టైనబుల్ జనరేటివ్ ఏఐపై ఐదు రోజుల పాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ లక్షల సంవత్సరాలు పట్టే లెక్కల్ని క్వాంటమ్ కంప్యూటర్లు నిమిషాల్లో చేయగలవన్నారు. భవిష్యత్తులో భద్రతా వ్యవస్థలు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థికం, మీడియా, కమ్యూనికేషన, సైబర్ భద్రత, విద్య, వాతావరణం, ఖగోళ పరిశోధన వంటి రంగాలను ప్రభావితం చేసేలా జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. విద్యార్థులు, యువత ఈ రంగంలో రాణిస్తే కీలకమైన స్థానానానికి చేరుకోవచ్చన్నారు.