
ఏడాదిలో కూటమి చేసిన అభివృద్ధి శూన్యం
రాయచోటి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కాదని, ఇక్కడ వంచన ప్రభుత్వం నడుస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు ఆర్ రమేష్ కుమార్ రెడ్డి విమర్శించారు. గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో ఏడాది పాలనపై నిర్వహించిన మీడియా సమావేశంలో రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఏడాది కాలంలో ఏదో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించారు. ఒక ఏడాదిలోనే రూ. 1,50,000 కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వార్థంతో అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్నారన్నారు. 50వేల కోట్ల టెండర్లు పిలవడం ఆయన లబ్ధికోసమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఎలాంటి అభివృద్ధి చేసిన పాపన పోలేదని విమర్శించారు. మహిళలపై ఇంత పెద్దఎత్తున అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. అన్నమయ్య జిల్లాలో మైనర్ బాలికల మరణాలపై ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. మంత్రులు, ఎ్మల్యేలు అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి అక్రమ వసూళ్లకోసం పోటీ పడుతున్నారంటూ దుయ్యబట్టారు. హంద్రీనీవా, గాలేరు–నగిరి నిధులకు కోతవేసి కేవలం కుప్పంకు తప్ప మిగతా ప్రాంతాలను పక్కన పెట్టారన్నారు. అన్నమయ్య జిల్లాకు హంద్రీనీవా నీరు కూటమి పాలనలో దక్కే అవకాశాలు లేవన్నారు. పి–4 కథ దేవుడెరుగు ఈ రాష్ట్రంలో ఎ–4 అమలవుతుందన్నారు. ఎ–4 అంటే అవినీతి, అరాచకం, ఆశ్రితపక్షపాతం, అక్రమ వసూళ్లు..అత్యాచారాలని వివరించారు. పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు భజన తప్ప ప్రజా సమస్యలపట్ల ఆయన గొంతు మూగబోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారని విమర్శించారు. మహిళల అక్రమ రవాణా జరుగుతోందని నాడు ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ కఠిన చట్టాలు తీసుకొచ్చి తలలు తీస్తానన్నాడని, నేడు కనిపించకుండా పోయారని దుయ్యబట్టారు.‘తల్లికి వందనం’లో చాలా మంది విద్యార్థుల అడ్మిషన్లు కావాల్సి ఉందన్నారు. 80 లక్షల మంది ఉంటే కేవలం 60 లక్షల మంది విద్యార్థులకు అంచనా వేశారన్నారు. సాక్షి మీడియా ప్రజల పక్షాన పోరాడుతుంటే కక్ష సాధింపుతో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం అమానుషమన్నారు. ఏడాది పాలన సూపర్ సిక్స్ డ్రైవర్షన్ కోసమే ఈ పన్నాగం పన్నారన్నారు. ఉర్సాలాంటి బినామీ కంపెనీలకు వేల ఎకరాల భూములు కట్టబెట్టడం చంద్రబాబు పాలనకు పరాకాష్ట అన్నారు. మహానాడులో తండ్రీ కొడుకులు పొగిడించుకోవడం కోసమే తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమంకోసం ఎటువంటి తీర్మానం చేయలేదన్నారు. ఏడాదిగా జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారాలకు ప్రాధాన్యత ఇచ్చారంటూ ఆరోపణలు గుప్పించారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి