
ఏడాదిపాలనలో చిల్లిగవ్వ అయినా తెచ్చారా?
మదనపల్లె రూరల్: అధికారపార్టీ ఎమ్మెల్యేగా, మున్సిపాలిటీకి ఏడాదికాలంలో ఏరోజైనా స్పెషల్ గ్రాంట్ కింద చిల్లిగవ్వ తెచ్చారా అంటూ ఎమ్మెల్యే షాజహాన్బాషాను, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డితో కలిసి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. రెండురోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో, కమిషనర్ ఛాంబర్లో కౌన్సిలర్లు లేకుండా ఎమ్మెల్యే షాజహాన్బాషా సమీక్షా సమావేశం నిర్వహించి, అవాస్తవాలు మాట్లాడిన వైనంపై ధ్వజమెత్తారు. శుక్రవారం మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చైర్పర్సన్ మనూజారెడ్డి మాట్లాడుతూ... రెండురోరోజుల క్రితం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్బాషా మాట్లాడుతూ...ఒక్కోవార్డుకు 30లక్షల చొప్పున ఇస్తానన్నారని, నిధులు స్పెషల్ గ్రాంట్ నుంచి ఇస్తారా..లేక జనరల్ ఫండ్ నుంచి ఇస్తారా ? ప్రజలకు వివరణ ఇవ్వాలని, జనరల్ ఫండ్కి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కావాలని, ఇందులో మీరు ఇచ్చేదేముందని మనూజారెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లుగా పట్టణంలో అభివృద్ధి జరగలేదని మాట్లాడారని, ఎమ్మెల్యే హోదాలో ఏడాదికాలంగా మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్న రోడ్లు, బోర్లు, డ్రైనేజీ కాలువలు...వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కౌన్సిల్ ఆమోదంతో చేసినవేనని మున్సిపల్ చైర్పర్సన్ గుర్తుచేశారు. సీఎఫ్ఎంఎస్ మహమ్మారి పీడ ఏప్రిల్ నుంచి విరగడైపోతుందని, గ్రీన్ఛానల్ ద్వారా కమిషనర్ చెక్పవర్తో తక్షణమే బిల్లుల చెల్లింపులు జరిగిపోతాయని ఏడాదిగా ఎమ్మెల్యే చెపుతూనే ఉన్నారని, ఇప్పటివరకు జరిగిన దాఖలా లేదన్నారు. మున్సిపల్ ట్రాక్టర్లకు డీజల్ బిల్లులు చెల్లించలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ ఖజానాలో మున్సిపాలిటీకి చెందిన 40 కోట్లు ఉన్నాయని, వాటిని ఇప్పిస్తే..ప్రతి వార్డుకు కోటికిపైగానే ఖర్చు చేసేందుకు పాలకవర్గం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తేకుండా అభివృద్ధి చేసేస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. 2021 మార్చి 18న మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీ కొలువుదీరినప్పటి నుంచీ ఇప్పటివరకు రూ.93కోట్ల 4 లక్షలతో 861 పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. వాటిలో 20కోట్ల 76లక్షలకు చెందిన 246 పనులు పూర్తిచేశామన్నారు. రూ.2కోట్ల12లక్షల పనులు జరుగుతున్నాయన్నారు. రూ.7.5 కోట్లతో 60 పనులకు కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు జరిగి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మున్సిపల్ వైస్చైర్మన్ జింకాచలపతి మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే..మున్సిపాలిటీలో పాలకవర్గం లేకుండా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం ఎంతవరకు సబబన్నారు. ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన 40 కోట్లు ఇప్పించండని ఎమ్మెల్యేను కౌన్సిల్ సమావేశంలో కోరితే...ఆయన హేళనగా 40 కాదు...400 కోట్లు మంజూరుచేయిస్తానని గొప్పలు చెప్పారని, అయితే ఇప్పటివరకు పైసా తేలేకపోయారన్నారు.ఏపీఎండీసీ మాజీ చైర్పర్సన్ షమీంఅస్లాం మాట్లాడుతూ...సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే...పట్టణంలో చేయాల్సిన అభివృద్ధిపై ప్రస్తావించకుండా కౌన్సిలర్లు జీరో అంటూ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ పథకాలను, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడం ద్వారా వార్డుల్లో కౌన్సిలర్లు హీరోలుగా తలెత్తుకుని తిరుగుతున్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ నూర్ఆజం, కౌన్సిలర్లు పెరవలిరాజేష్, ప్రసాద్బాబు, మేసీ్త్ర శ్రీనివాసులు, ఎం.లత, రేణుక, రామిశెట్టిశివ, రహీం, గుండ్లూరురఫీ తదితరులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో అవాస్తవాలు మాట్లాడితే ఎలా..?
ఎమ్మెల్యేను ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు