
మోగిన రైల్వే ఎన్నికల నగారా
నందలూరు (రాజంపేట): ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో రైల్వే పరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రైల్వే ఇన్స్టిట్యూట్ పాలకవర్గానికి ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు గురువారం రాత్రి గుంతకల్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ పర్సనల్ మేనేజరు నరసింహారావు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ప్రధానంగా జూలై 1న పాకాల, 4న రేణిగుంట, 7న నందలూరుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కడపకు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి, ఆరుగురు కమిటీ సభ్యుల పదవుల కోసం అభ్యర్థులు పోటీపడున్నారు. అలాగే మేనేజ్మెంట్ సభ్యులుగా వివిధ శాఖల నుంచి అధికారులు నియమితులవుతారు.
ఆంగ్లో ఇండియన్స్ నుంచి ..
బ్రిటీషు రైల్వేపాలకుల హయాం నుంచి నందలూరు రైల్వే ఇన్స్టిట్యూట్ వైభవంగా వెలుగొందింది. ఆంగ్లో ఇండియన్కు చెందిన డాయల్దొర, హోప్రిన్దొరతోపాటు మరి కొంత మంది కుటుంబాలు, వందలాది మంది కార్మికులు సభ్యులుగా కొనసాగారు. స్టీమ్ ఇంజిన్ లోకోషెడ్ ఉన్నప్పటి నుంచి వివిధ విభాగాలకు చెందిన కార్మికులు, వారి కుటుంబాల కోసం రైల్వే ఇన్స్టిట్యూట్ను 1920 కోసం శారీరక, మానసిక, విజ్ఞాన, క్రీడ, కళారంగానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రత్యేక రైల్వే టెన్నిస్ కోర్టులో శిక్షణ పొందిన టెన్నిస్ క్రీడాకారులు జోన్, డివిజన్ స్థాయిలో రాణించేవారు. కళాసమితి తరఫున రాష్ట్ర స్థాయిలో నాటక రంగ స్థలం పోటీలు నిర్వహించే వారు. ఆ సందర్భంగా అనేక మంది సినీనటులు ఇక్కడికి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అలాగే రైల్వే టెన్నిస్కోర్టును వేదికగా చేసుకొని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన ప్రసంగాన్ని ఇప్పటికీ రైల్వే పూర్వీకులు గుర్తు చేసుకుంటున్నారు.
పోటాపోటీగా తలపడనున్న
మజ్దూర్, సంఘ్
రైల్వే ఇన్స్టిట్యూట్ పాలకవర్గం ఎన్నికలలో గెలిచేందుకు సౌత్సెంట్రల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్లు పోటీపడుతున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికలో నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆధిపత్యం సాధించేందుకు ఈ కార్మిక సంఘాలు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నందలూరులో రైల్వే ఎన్నికల వేడి రాజుకుంది.
● ఎన్నికల ప్రక్రియ ఇలా..
రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
అభ్యర్థుల ఎంపికలో నేతలు కసరత్తు
19 నుంచి నుంచి నామినేషన్లు, 7న పోలింగ్
12న సభ్యుల జాబితా విడుదల చేయనున్నారు. 16న సభ్యత్వాల వినతుల స్వీకరణ ఉంటుంది. 17న తుది జాబితా విడుదల చేస్తారు. 19 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 25న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 28న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 7న పోలింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 4 వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని డీపీఓ ఎన్నికల షెడ్యూల్లో తెలియజేశారు.

మోగిన రైల్వే ఎన్నికల నగారా

మోగిన రైల్వే ఎన్నికల నగారా