
నేరస్తులకు శిక్ష పడేలా చార్జ్ షీట్లు దాఖలు చేయండి
రాయచోటి: పోలీసుశాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి పేర్కొన్నారు. గురువారం రాయచోటి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు రాజంపేట సబ్ డివిజన్ పోలీసు అధికారులకు నెలవారీ ‘నేర సమీక్షా’సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గ్రేవ్ (తీవ్రమైన) కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నేరస్తులకు శిక్ష పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలతో చార్జ్ షీట్లను నిర్ణీత గడువులోగా కోర్టులో దాఖలు చేయాలని స్పష్టం చేశారు. విదేశీయులు టూరిస్ట్ ’వీసా’పైన జిల్లాలోకి ప్రవేశించి ’వీసా’ సమయం అయిపోయినా జిల్లాలో ఉండే వారిని గుర్తించాలని, వారిని వారి దేశాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో జరిగే నేరాలను అరికట్టడానికి బీట్ పోలీసులు, గస్తీ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించడానికి నిఘా పెంచాలని సూచించారు.స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, బాలికలు, బలహీన వర్గాలపై జరిగే నేరాల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని హితవు పలికారు. కార్యక్రమంలో, స్తానిక పోలీసు అధికారులు, రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోని, సీఐలు, ఎస్ఐ లు పాల్గొన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి