
నమో వీరబ్రహ్మేంద్ర.!
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనాన్ని వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు. గర్భాలయంలోని మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి అర్చనామూర్తులకు గంగ, పంచామృతం, క్షీరం, ఫలోదకంలతో అభిషేకం చేశారు. అర్చనామూర్తులకు ప్రత్యేక వస్త్రాలంకరణ చేశారు. స్వామి గుణగణాలను కీర్తిస్తూ, 108 నామాలలో స్తుతిస్తూ సహస్ర నామార్చన కార్యక్రమాన్ని జరిపారు. సాయంత్రం వేదపారాయణం చేశారు.
కమనీయంగా శేషవాహనోత్సవం
రాత్రి శేషవాహనోత్సవం కమనీయంగా సాగింది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి పంచ శిరస్సులు గల శేషవాహనంపై ఆశీనులను చేశారు. పెద్దమఠం నుంచి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిమఠం వరకు ఊరేగించారు. అక్కడ చిన్నమఠం మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు తిరిగి పెద్ద మఠం చేరుకుంది. ఉత్సవానికి ప్రొద్దుటూరు పట్టణ పరిధి గురువయ్యతోటలోని కాలేజ్ రోడ్డుకు చెందిన పేర్ల వెంకట బ్రహ్మానందరెడ్డి, గుంటూరు జిల్లా క్రోసూరుకు చెందిన చేపూరి నరసింహాచారి, ఆయన భార్య విజయలక్ష్మి ఉభయదారులుగా వ్యవహరించారు. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం యడవల్లి రమణయ్య భాగవతార్ ఆధ్వర్యంలో హరికథా గానం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకుని తరించారు. దాతలు అన్నదానం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలు విరివిగా చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మఠం ఫిట్పర్సన్ సి.శంకర్బాలాజి, మేనేజర్ ఎన్.ఈశ్వరయ్య ఆచారి ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కుమారులు శ్రీ వెంకటాద్రిస్వామి, భద్రయ్యస్వామి, వీరంబొట్లయ్యస్వామి, దత్తాత్రేయస్వామి, గోవిందు స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఆరాధనోత్సవాలు ప్రారంభం
స్వామి వారికి ప్రత్యేక పూజలు
భారీగా తరలివచ్చిన భక్తులు

నమో వీరబ్రహ్మేంద్ర.!