
బసినికొండ ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు
మదనపల్లె : బసినికొండలో టీడీపీ బరితెగింపు శీర్షికతో మంగళవారం సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారుల నుంచి స్పందన లభించింది. బసినికొండ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్.682–బీలోని 2.74 ఎకరాల విస్తీర్ణంలోని భూమి ప్రభుత్వానికి చెందినదని, ఎవరైనా ప్రవేశించినా, ఆక్రమించినా శిక్షార్హులంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే, అంతకుముందే బసినికొండకు చెందిన టీడీపీ మైనారిటీ నాయకుడు ఎస్.ఎం.రఫీ వివాద స్థలంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి, సర్వే నంబర్.682–బిలో చాలాకాలం క్రితమే పట్టాలు మంజూరు చేశారని, అప్పుడు ఇళ్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తే కొందరు అడ్డుకున్నారన్నారు. తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చేసేదిలేక ఊరుకున్నామన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇళ్లు నిర్మించేందుకు స్థలాన్ని జేసీబీతో శుభ్రం చేయిస్తుంటే, ఆక్రమిస్తున్నారంటూ సాక్షిలో వార్త రాశారని, తమ వద్ద భూమికి సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నాయంటూ జిరాక్స్ కాపీలు చూపించారు. అనంతరం కొద్దిగంటల తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ భరత్, వీఆర్ఓలతో కలిసి టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నించిన స్థలంలోకి వెళ్లి ఎఫ్ఎంబీ, విలేజ్ రెవెన్యూ మ్యాప్ తదితర రికార్డులను పరిశీలించి, సర్వేనెంబర్.382–బీలోని 2.74 ఎకరాల భూమి ప్రభుత్వ గయాళు స్థలంగా నిర్ధారించారు. హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.

బసినికొండ ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు