
విజయవంతంగా హ్యాక ధాన్
కురబలకోట: మదనపల్లె దగ్గర అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో 24 గంటల పాటు జాతీయ స్థాయి ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ హ్యాక ధాన్ ఇంపాక్ట్స్–25ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ యువరాజ్ సోమవారం తెలిపారు. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ విభాగాలు గీక్స్ ఫర్ గీక్స్ సహకారంతో దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు తెలిపారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పరిష్కరించే సాంకేతిక ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో ప్రేరేపించడం ఈ హ్యాక్ధాన్ ప్రాథమిక లక్ష్యమన్నారు. 246 మంది 73 గ్రూపులుగా పోటీ బృందాలు ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లర్నింగ్, ఎడెటెక్, హెల్త్కేర్, ఆగ్రోటెక్, స్మార్ట్ సిటీస్, సస్టైన్బులిటీ, ఎన్విరాన్మెంట్, స్టూడెంట్ ఇన్నోవేషన్ వంటి కీలక అంశాలపై విద్యార్థులు దృష్టి సారించారన్నారు. బెంగళూరుకు చెందిన గీక్స్ ఫర్ గీక్స్ లర్నింగ్ డైరెక్టర్ అభిషేక్ మాట్లాడుతూ ఇలాంటి హ్యాక్ధాన్ల ద్వారా నిర్దిష్ట సమస్యను తరచుగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదా సాఫ్ట్వేర్కు సంబంధించిన వాటిని పరిష్కరించడానికి ఉపయోగిస్తారన్నారు. విజేతలుగా నిలచిన పుత్తూరు సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల టెక్బ్రైట్ టీమ్ టి. మనోజ్కుమార్కు మొదటి బహుమతి కింద రూ.25వేలు, మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల డైనమోస్ టీమ్ కె. తిరిశాంక్కు రెండో బహుమతి రూ.20 వేలు, ఎస్వీ సెట్ది స్టైవర్స్ టీమ్ పి. దినేష్కుమార్ రెడ్డికి మూడవ బహుమతి కింద రూ.15వేలు, ఆ తర్వాత ఎస్వి సెట్ ఐఓటి స్క్వాడ్ వై.శశిధర్ రెడ్డికి 10 వేలు, మిట్స్ కళాశాల మైల్ వర్త్ సి. బాలాజీకి రూ.5వేలు చొప్పున అందజేసినట్లు తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ హ్యాక్ ధాన్లో పాల్గొనడం వల్ల టెక్నాలజీ ద్వారా సామాజిక మార్పు తీసుకురావడంలో విద్యార్థులు భాగస్వాములు కావచ్చన్నారు.