ఎస్సీ వర్గం వారినే అవమానిస్తున్నారు
ఇక టీడీపీలో ఉండలేం..
ఎన్నికల ఖర్చులు ఇచ్చేస్తే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్
తిరుపతి కల్చరల్: టీడీపీలో దళిత ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు కోనేటి సుమన్ కుమార్ చెప్పారు. ఆయన గురువారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ఎమ్మెల్యేగా గెలిచాక కనీస గౌరవం కూడా టీడీపీలో దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో తప్పులు చేసిన వారెవరినీ పట్టించుకోకుండా కేవలం ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతోనే తన తండ్రిపై వివక్ష చూపారని వాపోయారు.
కూటమి పార్టీల్లో ఎవరూ తప్పు చేయలేదా? వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సత్యవేడు సీఐ ఉద్యోగ బాధ్యతను పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారని, తమిళనాడుకు రోజుకు 50 నుంచి 60 లోడ్ల ఇసుకను దగ్గరుండి మరీ పంపుతున్నారని ఆరోపించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై నారాయణవనం జెడ్పీటీసీగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం, గౌరవం ఇవ్వడంలేదన్నారు. ఇక తాము పార్టీలో ఉండేది లేదని, ఎమ్మెల్యే పదవి కోసం ఖర్చు చేసిన డబ్బులు తమకు ఇచ్చేస్తే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తామని చెప్పారు.


