నవరత్నాలపై విస్తృత ప్రచారం | Vijaya Sai Reddy Comments In meeting of social media activists | Sakshi
Sakshi News home page

నవరత్నాలపై విస్తృత ప్రచారం

Mar 11 2022 4:03 AM | Updated on Mar 11 2022 1:15 PM

Vijaya Sai Reddy Comments In meeting of social media activists - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను అర్హులందరికీ అందేలా వైఎస్సార్‌పీపీ నేత, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌ వేణుంబాక విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియా కార్యకర్తలకు సూచించారు. సోషల్‌ మీడియా విభాగాన్ని మహిళ, యువత, విద్యార్థి, రైతు విభాగాలతో సంఘటితం చేస్తామన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సోషల్‌ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను క్షేత్రస్థాయికి చేరవేయాలన్నారు.  

అక్రమ కేసులపై న్యాయ పోరాటం.. 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశించినట్లుగా కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించాలన్నారు. దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో పథకాలను అందజేస్తున్న పరిస్థితి లేదన్నారు. ప్రజా సమస్యలతోపాటు సోషల్‌ మీడియా కార్యకర్తల వ్యక్తిగత ఇబ్బందులను పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తెస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ పని చేస్తుందని, తాను కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తానన్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తలపై టీడీపీ బనాయించిన అక్రమ కేసుల విషయంలో పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇందుకోసం సోషల్‌ మీడియా విభాగంతో పార్టీ లీగల్‌ సెల్‌ను సమన్వయం చేస్తామన్నారు. పార్టీ సభ్యత్వం ద్వారా సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఐడీ కార్డులతోపాటు ప్రత్యేకంగా యాప్‌ రూపొందిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడంతోపాటు విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా కృషి చేయాలని సూచించారు. 

మూడు చోట్ల జాబ్‌ మేళాలు... 
యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. మొదటి జాబ్‌మేళా ఏప్రిల్‌ 16, 17 తేదీలలో తిరుపతిలో జరుగుతుంది. 23, 24 తేదీలలో విశాఖలో నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 30, మే 1 తేదీల్లో తాడేపల్లిలో జాబ్‌మేళా ఉంటుంది. దాదాపు 4,500 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఐటీ, టెక్స్‌టైల్, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్, మాన్యుఫాక్చరింగ్, ఐటీఈఎస్, రిటైల్, ఆటోమొబైల్, రిటైల్‌ రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ లను నియమిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించగా పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పిఠాపురం శాసనసభ్యుడు దొరబాబు తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement