
ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లే
అపార్ట్మెంట్లు, కాలనీల్లో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు
కేంద్రాల వద్ద మొబైల్ డిపాజిట్ సదుపాయం
భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని, భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో ఎన్నికల సంఘం సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడం ద్వారా ఓటర్లను చైతన్యపరచడంలో మీడియా సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్, సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చేపట్టిన 23 నూతన కార్యక్రమాలు, ఓటర్లు, రాజకీయ పార్టిలు, ఎన్నికల సిబ్బందికి కలి్పస్తున్న సదుపాయాలు, సంస్కరణలు, చట్టపరమైన చర్యలు, ఈసీఐ నూతన ఆవిష్కరణలు, వనరులను వివరించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రత్యేక సార్వత్రిక నమోదు(ఎస్ఎస్ఆర్) కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఓటరు సమాచార స్లిప్లు మరింత ఉపయోగకరంగా మారనున్నాయని, ఓటరు సీరియల్, పార్ట్ నంబర్లను స్పష్టంగా చూపించనున్నామన్నారు.
ఒక పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1,200 మంది ఓటర్లనే అనుమతినిస్తున్నామని తెలిపారు. ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సదుపాయాన్ని, అపార్టుమెంట్లు/కాలనీల్లో అదనపు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టిల ప్రచార దూర పరిమితి పోలింగ్ కేంద్ర ప్రవేశ ద్వారానికి 100 మీటర్లకు తగ్గించామని స్పష్టం చేశారు.
డూప్లికెట్ ఓటరు కార్డుల తొలగింపు..
ఈసీఐనెట్ అనే కొత్త సమగ్ర డాష్బోర్డ్ను ప్రారంభించి, 40కి పైగా యాప్లు/వెబ్సైట్ల స్థానంలో ఒకే యాప్ను రూపొందించి అన్ని సేవలను ఒకే చోటకి అందుబాటులోకి తెచ్చామని పవన్ పేర్కొన్నారు. యూనిక్ ఎపిక్ నంబర్ పద్ధతి అమలు చేసి డూప్లికేట్ కార్డులను తొలగించామన్నారు.