దుబాయ్‌లో భర్త… భార్య ఇందు అనుమానాస్పద మృతి | married woman ends life in srikakulam district | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో భర్త… భార్య ఇందు అనుమానాస్పద మృతి

May 6 2026 8:22 AM | Updated on May 6 2026 8:22 AM

married woman ends life in srikakulam district

శ్రీకాకుళం : చినపల్లివూరు గ్రామానికి చెందిన గర్తం ఇందు(25) అనే వివాహిత సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. అమలపాడు పంచాయతీ చింతవానిపేటకు చెందిన ఇందుకు.. చినపల్లివూరుకు చెందిన గర్తం శంకరరావుతో 2017లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కవలలు (బాబు, పాప) ఉన్నారు. ఇందు తండ్రి లోకనాథం చిన్న వయస్సులోనే మృతి చెందగా తల్లి మోహిని అన్నీ తానై పెంచింది. కట్న లాంచనాలతో వివాహం చేసింది. ఇందు భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లి వస్తుంటాడు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శంకరరావు దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ ఇందు సోమవారం రాత్రి ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న తల్లి మోహిని, సోదరుడు సందీప్‌ హుటాహుటిన వెళ్లి విగతజీవిగా పడి ఉన్న ఇందుని చూసి బోరున విలపించారు. కాగా, ఇందు ఉరి వేసుకొని చనిపోయేంత పిరికిది కాదని,  కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి మోహిని, సోదరుడు సందీప్‌ ఆరోపించారు. కొద్దిసేపటి కిందటే ఇందుతో వీడియో కాల్‌లో మాట్లాడామని, ఇంతలో ఏం జరిగిందో తెలియదని చెప్పారు. 

భర్త శంకరరావు, అత్త వరలక్ష్మి  చాలా రోజులుగా తమ కుమార్తెను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ వైకుంఠరావు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement