కర్నూలులో డీఆర్‌డీవో లేజర్ ఆయుధ పరీక్ష సక్సెస్‌.. భారత్‌ సరికొత్త రికార్డు | DRDO laser-based weapon demonstration success at Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో డీఆర్‌డీవో లేజర్ ఆయుధ పరీక్ష సక్సెస్‌.. భారత్‌ సరికొత్త రికార్డు

Apr 14 2025 10:45 AM | Updated on Apr 14 2025 3:45 PM

DRDO laser-based weapon demonstration success at Kurnool

కర్నూలు: భారత అమ్ములపొదిలోకి సరికొత్త లేజర్ అస్త్రం చేరనుంది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఇందుకు ఏపీలోని కర్నూలు జిల్లా వేదికైంది. ఈ సందర్బంగా 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను ఉపయోగించి డ్రోన్లను కూల్చివేసే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష విజయవంతమైంది.

వివరాల ప్రకారం.. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుతమైనన లేజర్‌ వ్యవస్థను డీఆర్‌డీవో తీసుకువచ్చింది. కర్నూలులోని ఓర్వకల్లులో నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌లో ఆదివారం ప్రయోగం జరిగింది. ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, మిస్సైళ్లు, డ్రోన్లను ఈ లేజర్ ఆయుధంతో కూల్చివేయడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో లేజర్ కిరణం తాకగానే, లక్ష్యంగా ఉన్న వస్తువు కాలి బూడిదైంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత రక్షణ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. దీంతో, ఇలాంటి వ్యవస్థ కలిగిన అమెరికా, చైనా, రష్యా దేశాల సరసన భారత్‌ చేరింది. ఇజ్రాయెల్‌ సైతం ప్రయోగాలు చేస్తోంది. ఇక, దీనికి సంబంధించిన వీడియోలను డీఆర్‌డీవో ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.

అయితే, ఈ ఆయుధాన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌ సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ (CHESS) అభివృద్ధి చేసింది. దేశంలోని ఇతర ల్యాబ్‌లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు సైతం ఇందులో పాలుపంచుకున్నాయి. ఈ ఆయుధానికి MK-2(A) DEW అని పేరు పెట్టారు. తాజా పరీక్షలో ఈ అస్త్రం తన పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చాటినట్లు డీఆర్‌డీవో ప్రకటించింది. చాలా దూరంలో ఉన్న ఫిక్స్‌డ్‌ వింగ్‌ డ్రోన్లను నేలకూల్చింది. అదే విధంగా డ్రోన్ల దాడిని తిప్పికొట్టింది. ‘శత్రువుల’ నిఘా సెన్సార్లు, యాంటెన్నాలను ధ్వంసం చేసి, మెరుపువేగంతో సెకన్లలోనే లక్ష్యాలపై విరుచుకుపడే సామర్థ్యాన్ని చాటింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement