కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు..

CM YS Jagan Video Conference With Collectors And SPs - Sakshi

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ స్పందన వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దని.. నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. కోవిడ్‌ నివారణ చర్యలు, స్కూళ్లు, అంగన్‌వాడీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, గిరిజన ప్రాంతాల్లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.(చదవండి: ఆ శక్తి కేవలం విద్యకే ఉంది: సీఎం జగన్‌)

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులున్నాయని.. ఈ నేపథ్యంలో ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్‌–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలని, పీహెచ్‌సీలు, యుహెచ్‌పీలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్‌ ఆసుపత్రలు, జీజీహెచ్‌లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరి ఉండాలన్నారు.

‘‘కోవిడ్‌ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో ఎవరికీ రాకూడదు. కోవిడ్‌ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుపత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్‌ సెంటర్‌ను ఉపయోగించుకోవాలి. ఈ నంబర్‌ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ కాల్‌ సెంటర్ ‌నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే దానిపై స్పందించాలి. ఆ ఫోన్‌ కాల్స్‌పై ఎలా రెస్పాండ్‌ అవుతున్నామనేదే పని తీరుకు అద్దం పడుతుంది. కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన వ్యక్తి పట్ల మనం ఎలా రెస్పాండ్‌ అవుతున్నామో జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. జిల్లా కలెక్టర్లు, జేసీలు ప్రతి రోజూ 104 కాల్‌ సెంటర్లకు, జిల్లా కోవిడ్‌ సెంటర్లకు మాక్‌ కాల్స్‌ చేసి, వ్యవస్థలో ఎక్కడైనా ఉదాసీనత వుందా లేదా అనే దానిని పరీక్షించాలని’’  సీఎం పేర్కొన్నారు.

ఆర్‌టీపీసీఆర్, ట్రూనాట్‌ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటలు, రాపిడ్‌ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. జిల్లాల్లోని అన్ని ల్యాబ్‌లకు అవసరమైన పరికరాలను అందించామని, ఎక్కడా కిట్లు లేవనే పేరుతో పరీక్షలు నిరాకరించకూడదని సీఎం స్పష్టం చేశారు. పాజిటివ్‌ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు వున్న వారిని కచ్చితంగా హోం క్వారంటైన్‌లో వుంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

‘‘కోవిడ్‌ నేపథ్యంలో అదనంగా 17 వేల మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఆరు నెలల కాలానికి కాంట్రాక్ట్‌ విధానంలో నియమించేందుకు అనుమతి ఇచ్చాం. మరో 11 వేల మంది ట్రైనీ నర్స్‌లను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి ఇంకా కొన్నిచోట్ల నియామకాలు పూర్తి కాలేదు, వాటిని వెంటనే పూర్తి చేయాలి. మరో వారం రోజుల్లో రెగ్యులర్‌ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి. నియామకం పొందిన అభ్యర్ధులు వెంటనే వారికి నిర్ధేశించిన కోవిడ్‌ విధుల్లో చేరాలి. దానిని కూడా కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.

హోం ఐసోలేషన్‌లో వున్న వారికి అవసరమైన మందులతో కూడిన మెడికల్‌ కిట్‌లను పంపిణీ చేశామని, మెడికల్‌ ఆఫీసర్‌ ఫోన్‌లో 14 రోజుల పాటు పేషంట్‌కు అందుబాటులో వుండాలన్నారు. జాయింట్‌ కలెక్టర్లు ఈ హోం కిట్‌లలో అన్ని మందులు వున్నాయో లేదో పర్యవేక్షించాలని’’  సీఎం సూచించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌లు ప్రవేశపెట్టాలి. ప్రతి సచివాలయ ఉద్యోగి సచివాలయంలోనే కూర్చుని విధులు నిర్వహించాలి. వాలంటీర్లు వారంలో కనీసం మూడు రోజులు సచివాలయంలో అటెండెన్స్‌ ఇవ్వాలి. ఖాళీగా ఉన్న వాలంటీర్‌ పోస్టులను భర్తీ చేయాలి. ప్రజలకు అందించే సేవలకు సంబంధించి ఇచ్చిన టైం లైన్‌లోనే పని చేయాలి. వారానికి రెండుసార్లు కలెక్టర్లు.. నాలుగుసార్లు జేసీలు గ్రామ సచివాలయాలను సందర్శించాలి. నెలకు రెండుసార్లు హెచ్‌వోడీలు, సెక్రటరీలు గ్రామ సచివాలయాలకు వెళ్లాలి. 200 మందితో ఇప్పటికే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయాల్లో సేవలను ఈ కాల్‌సెంటర్‌ పర్యవేక్షిస్తుందని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఉపాధి హామీపై సీఎం వైఎస్ జగన్
నరేగాకు సంబంధించి రాష్ట్రానికి 4.25 కోట్ల పనిదినాలు అదనంగా వచ్చాయి. దీనితో పాటు అదనంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కూడా పెరుగుతుంది.  రూ.4వేల కోట్లకు సంబంధించిన మెటీరియల్‌ కాంపోనెంట్‌కు అవకాశం వుంది. ప్రతి జిల్లాలో రూ.పదికోట్లు ప్రతి వారంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేపట్టాలి. పేమెంట్లు కూడా ఈ నెలలో పెండింగ్‌ లేకుండా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్స్‌ను పూర్తి చేయడం, అంగన్‌ వాడీ కేంద్రాల నిర్మాణాలు, స్కూల్‌ కాంపొండ్‌ లను పూర్తి చేయడంపై దృష్టిపెట్టాలి. ఈ నెలాఖరు నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలి. అక్టోబర్‌ నుంచి డ్రైన్స్, గతంలో ఒకశాతం పనులు జరిగి, నిలిపివేసిన వాటికి కూడా అనుమతి ఇవ్వాలి. రూ.2వేల కోట్ల పనులు ఒకశాతం కన్నా ఎక్కువ ఖర్చు చేసినవి వున్నాయి. వాటికికూడా అనుమతులు ఇస్తాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top