
రౌండ్టేబుల్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వార్డు/గ్రామ సచివాలయాల జేఏసీ ప్రతినిధులు
ఈ నెల 27 నాటికి చర్చలకు పిలవాల్సిందే
లేదంటే పింఛన్లు పంపిణీ చేయం
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ జేఏసీ హెచ్చరిక
పెనమలూరు: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. సచివాలయ ఉద్యోగుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ నెల 27వ తేదీ నాటికి ప్రభుత్వం చర్చలకు పిలవాలని.. లేదంటే అక్టోబర్ 1న పింఛన్లు పంపిణీ చేసేది లేదని హెచ్చరించింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి ప్రెస్క్లబ్లో ఆదివారం జేఏసీ రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. అనంతరం సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ/వార్డు సచివాలయాలకు చెందిన 19 శాఖల సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి డిమాండ్ల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించామని తెలిపారు.
సెప్టెంబర్ 27నాటికి ప్రభుత్వం చర్చలకు పిలవాలని, లేనిపక్షంలో పింఛన్ల పంపిణీని బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 22న సెర్ప్ సీఈఓకు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ నుంచి నోటీసులు ఇస్తామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే విధుల్లో సహకరించబోమన్నారు. 23, 24, 25 తేదీల్లో కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, శాఖాధిపతులకు నోటీసులు ఇస్తామని తెలిపారు. 26, 27 తేదీల్లో ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపుల నుంచి సచివాలయ సిబ్బంది స్వచ్ఛందంగా వైదొలుగుతామని అధికారులకు స్పష్టం చేస్తామన్నారు.
28న కర్నూలులో ప్రాంతీయ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి 9 నెలలుగా రావాల్సిన ఎరియర్లు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటివ్ అడ్వాన్స్ స్కీమ్, డీఏ బకాయిలు చెల్లించాలని కోరారు. ఆర్థికేతర అంశాలు, ఉద్యోగులకు నిర్దిష్టమెన సర్వీస్ రూల్స్, తరచుగా నిర్వహించే సర్వేలు, అసంబద్ధమైన హేతుబద్దీకరణ, అంతర్ జిల్లాల బదిలీలు వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీష్, కన్వినర్ పులిబండ్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.