Anil Kumar Singhal: మేలో 13 లక్షలకు పైగా డోసులు

Anil Kumar Singhal Comments On Covid Vaccine Doses Purchase - Sakshi

రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది.. రెండు  కంపెనీలతోనూ మాట్లాడుతున్నాం

వాటిలో కోవిషీల్డ్‌ 9,91,700 డోసులు, కోవాగ్జిన్‌ 3,43,930 డోసులు

కోవిడ్‌ బారిన పడి సీరియస్‌ అవుతున్నది ఎక్కువగా పెద్ద వారికే

కాబట్టి 45 ఏళ్లు దాటిన వారికే టీకాలో తొలి ప్రాధాన్యం

వారికి పూర్తయ్యాకే ఇతర వయసుల వారికి వ్యాక్సిన్‌

ఇదే విషయమై ప్రధానమంత్రికి లేఖ రాయనున్న ముఖ్యమంత్రి

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్పష్టీకరణ

సొంతంగా ఆక్సిజన్‌  ట్యాంకర్ల కొనుగోలు...

ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నామని వెల్లడి  

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు మే నెలకు సంబంధించి 13 లక్షలకు పైగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలియజేశారు. వాటిలో 9,91,700 కోవిషీల్డ్, 3,43,930 కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోసులు ఉంటాయన్నారు. వీటిని ఏపీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దీనికోసం ఆ రెండు కంపెనీలతో మాట్లాడుతున్నామని, త్వరలోనే కొనుగోలు చేస్తామని చెప్పారాయన. ధరల విషయం ఆ కంపెనీలతో ఇంకా చర్చించలేదన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింఘాల్‌ మాట్లాడారు. గత 24 గంటల్లో 86,494 కోవిడ్‌  శాంపిళ్లు టెస్టు చేయగా, 17,354 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 64 మరణాలు సంభవించాయని చెప్పారు.

నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,63,90,360 టెస్టులు చేయగా, 11,01, 690 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. ‘‘మొత్తంగా పాజిటివిటీ రేటే 6.72 శాతంగా ఉంది. రోజు వారీగా చూస్తే గత 24 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో 15,291 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అందుబాటులో ఉన్నాయి. వాటిలో వివిధ కంపెనీలకు చెందిన 9,646 ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కొనుగోలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం 5,645 ఇంజక్షన్లను ఇచ్చింది.

గురువారం (29.4.2021) నాటికి ప్రభుత్వాసుపత్రుల్లో 29 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందివ్వగా, శుక్రవారం 30,559 ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాం. నిజానికి లక్షణాలున్న వారంతా తొలుత ఆసుపత్రుల్లో చేరిపోయారు. ఎక్కువ లక్షణాలున్న వారికే ఇప్పుడు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. తక్కువ లక్షణాలున్నవారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించి సేవలందిస్తున్నాం’’ అని వివరించారు. 

45 ఏళ్లు పైడిన వారికే వ్యాక్సిన్లో ప్రాధాన్యం
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వ్యాక్సిన్‌ను 45 ఏళ్ల పైబడిన వారికి వినియోగిస్తున్నామని సింఘాల్‌ తెలిపారు. ‘‘రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారు 1.48 కోట్ల మంది, 18 – 45 ఏళ్ల వారు  2.04 కోట్ల మంది ఉన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తవ్వాలంటే 3 కోట్ల డోసులు కావాలి. ఇప్పటికి రాష్ట్రానికి 55 లక్షల డోసులు రాగా వాటిని 45 ఏళ్లు దాటినవారికి ఇచ్చాం. వారికి ఇంకా 2.5 కోట్ల డోసులు కావాలి. కాబట్టి వారికి ఇచ్చాకే ఇతర వయసు వారికిస్తే బాగుంటుందన్నది ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచన. ఎందుకంటే వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న 70 ఏళ్ల వృద్ధులకు... 18 ఏళ్ల పిల్లలతో పోలిస్తే కోవిడ్‌ ముప్పు ఎక్కువ. వారికి సోకితే పిల్లల మాదిరి తేలిగ్గా కోలుకోలేరు. ఆ ఉద్దేశంతోనే కదా ప్రధానమంత్రి మొదట పెద్దలకు టీకా ఇవ్వాలని నిర్దేశించారు. మరి వారికి పూర్తికాకుండా చిన్నవారికి ఇస్తే ఆ ఉద్దేశం నెరవేరదు కదా అన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. అందుకే ఈ అంశాలన్నిటినీ వివరిస్తూ ఆయన ప్రధానమంత్రికి లేఖ కూడా రాయబోతున్నారు’’ అని సింఘాల్‌ వివరించారు. ఈ నేపథ్యంలో మే 1 నుంచి కూడా 45 ఏళ్లు దాటినవారికే ప్రాధాన్యమిస్తామని, వారికి పూర్తయ్యేదాకా 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి రాష్ట్రంలో టీకా ఇవ్వబోవటం లేదని తెలియజేశారు.

104 కాల్‌ సెంటర్‌ కు పెరిగిన తాకిడి...
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 104 కాల్‌ సెంటర్‌ ను బలోపేతం చేశామని, సిబ్బందని నియమించామని  సింఘాల్‌ తెలిపారు. దీంతో శుక్రవారం 104కు ఏకంగా 15వేల కాల్స్‌ వచ్చాయన్నారు. గతంలో రోజుకు 7 వేలు కాల్స్‌ వచ్చేవని చెప్పారు. వాటిలో 3,698 టెస్టుల కోసం, 3,183 ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్న బంధుల సమాచారం కోసం వచ్చాయన్నారు. 2,672  కొవిడ్‌ టెస్టు రిజల్ట్‌ కోసం రాగా, 936 వాక్సినేషన్‌ నిమిత్తం వచ్చాయని తెలిపారు.

టెలీ కాల్‌ సెంటర్‌ కు 2,612 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయన్నారు. హోం ఐసోలేషన్‌ పేషంట్లకు కూడా టెలీ మెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ ద్వారా ఆరోగ్య సేవలు, సలహాలు సూచనలు అందిస్తున్నామన్నారు. హోం ఐసోలేషన్‌లో  ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితుల కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఐఏఎస్‌ స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమించామన్నారు. వారికి కిట్లు అందాయా..? మందులు అందుతున్నాయా...? ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోడానికి ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పరామర్శిస్తున్నారా..? అనేవిషయాన్ని సదరు అధికారి పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. 

సొంతంగా ఆక్సిజన్‌ ట్యాంకర్ల కొనుగోలు...
కరోనా బాధితులకు తక్షణమే ఆక్సిజన్‌ను అందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ట్యాంకర్లను కొనుగోలు చేయనున్నట్లు సింఘాల్‌ చెప్పారు. గడిచిన 24 గంటల్లో 437 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా చేశామన్నారు. రోజు వారీగా కేంద్రం రాష్ట్రానికి 470 టన్నులను కేటాయించిందన్నారు. వీటిని పెంచాలని కోరుతున్నామన్నారు. పెట్రోలియం కంపెనీలకు చెందిన ట్యాంకర్లను లిక్విడ్‌ ఆక్సిజన్‌ రవాణాకు వాడుకోవాలని  కేంద్ర ప్రభుత్వ కమిటీ చెప్పిందన్నారు. దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాలకు 9 ట్యాంకర్లు కేంద్ర కమిటీ కేటాయించగా, వాటిలో 2 ట్యాంకర్లను ఆంధ్రాకు అందజేయనుందని, త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

ఇక కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను బలోపేతం చేశామని ఆయన వెల్లడించారు. చిత్తూరులో 6 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ప్రారంభించగా, అందులో 2,636 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. గుంటూరులో 1,376 మంది, కర్నూలులో 1,313 మంది కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 7,749 మంది కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్నారన్నారు. వచ్చే రెండు రోజుల్లో  ఈ సంఖ్య 15 వేల మందికి చేరుకోచ్చునని అంచనా వేస్తున్నామన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతోందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top