అనంతపురం: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారిందని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మండిపడ్డారు. పార్టీ యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలాంజనేయులుపై పోలీసులు అక్రమంగా కేసు బనాయించడంతో మనస్తాపం చెందిన ఆయన మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం సాయంత్రం అనంతపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యువజన విభాగం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాకే చంద్ర మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో బాలాంజనేయులుపై 15కు పైగా కేసులు నమోదు చేశారన్నారు. వేధింపులతోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. తక్షణం అక్రమ కేసులు ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు శ్రీనివాస గురుదత్త, జిల్లా ఉపాధ్యక్షులు వినీత్, ఉదయ్, నగర ప్రధాన కార్యదర్శులు మసూద్, హర్ష, నగర కార్యదర్శులు మైను, నగేష్, రాంభూపాల్ రెడ్డి, నగర కమిటీ సభ్యుడు నరేంద్ర, వార్డు అధ్యక్షుడు సుబ్బారావు, యూత్ వింగ్ సభ్యులు షాషు, ఆనంద్బాబు, సాయికుమార్, విజయ్, ఆర్యవర్దన్, మంజు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర ధ్వజం


