గుంతకల్లు: ప్రయాణికులకు సౌకర్యాల కల్పనే ధ్యేయమని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గుంతకల్లు–మార్కాపురం రోడ్డు ప్యాసింజర్తో పాటు విశాఖపట్నం–కడప మార్గంలో గుంతకల్లు వరకు పొడిగించిన తిరుమల ఎక్స్ప్రెస్ రైళ్లను మంగళవారం వారు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ అమృత్ రైల్వేస్టేషన్ల కింద అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. గుంతకల్లు–వాడి మధ్య 3,4 రైల్వేలైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, దీంతో సరుకు రవాణా, రైలు ప్రయాణం మరింత సులభతరమవుతుందన్నారు. ఎంపీ అంబికా మాట్లాడుతూ అయోధ్య వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా బెంగుళూరు–అయోధ్యతోపాటు గుంతకల్లు–బెంగుళూరు ఉదయం పూట మరో రైలును ఏర్పాటు చేయాలని రెల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కరోనా సమయంలో రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించడంతో పాటు బెంగళూరు–అనంతపురం మధ్య నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లను గుంతకల్లు వరకు పొడిగించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందు, నాయకులు ఎస్ఎండీ గౌస్ ఎంపీ అంబికాకు వినతి పత్రం అందజేశారు. ఫిట్మెట్ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు రైళ్ల కోచ్ మెయింటెనెన్స్ డిపోను గుంతకల్లులో ఏర్పాటు చేసేలా రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం శివప్రసాద్, సీనియర్ డీసీఎం మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


