● అంబులెన్స్ను మూలనపెడితే ఎలా?
● ఆస్పత్రిలో శానిటేషన్ను మెరుగుపరచండి
● డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిప్యూటీ కమిషనర్ సుజాత
గుంతకల్లుటౌన్: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు ఉదయం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించడంతో పాటు ఎమర్జెన్సీ కేసులకు సంబంధిత వైద్యనిపుణులు తప్పనిసరిగా హాజరుకావాలని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సుజాత ఆదేశించారు. సోమవారం గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. లేబర్, మెడికల్ వార్డులు, ఎమర్జెన్సీ క్యాజువాలిటీల్లో ఇన్పేషెంట్లను కలిసి వైద్యసేవలపై ఆరాతీశారు. కాన్పుల సమయంలో సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారా అని ఆమె బాలింతలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు అమర్చి కనెక్షన్ ఇవ్వకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. ఆస్పత్రికి మంజూరు చేసిన అంబులెన్స్ను మూలనపెట్టడమేంటని వైద్యాధికారులను నిలదీశారు. వెంటనే మరమ్మతేలు చేయించి ఓ డ్రైవర్ను ఏర్పాటు చేయాలని, ఈ విషయమై తనకు ప్రతిపాదనలను పంపాలన్నారు. రోగులను ఓపీ కోసం క్యూలైన్లో నిల్చోబెట్టకుండా (మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్) ద్వారా ఆన్లైన్లో డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని, దాని ఆధారంగా కేటాయించిన సమయంలో వైద్యసేవలు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ సెల్వరాజ్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రేయ, ఇన్చార్జ్ సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ జయవర్ధన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


