గుత్తి: కొత్తిమీర, అల్లం ధరలు కొండెక్కాయి. వారం క్రితం కట్ట కొత్తమీర రూ. 15 నుంచి రూ. 20కు విక్రయించారు. అల్లం కిలో రూ. 70కు విక్రయించారు. ఆదివారం అమాంతం ధరలు పెరిగిపోయాయి. కట్ట కొత్తమీర రూ. 40, అల్లం కిలో రూ. 140కు చేరింది. తోపుడుబండ్ల మీద ఇళ్ల వద్దకే కూరగాయలు తెచ్చేవారు అంత ధర పెట్టి అల్లం, కొత్తిమీర కొనలేక వాటికి స్వస్తి చెప్పారు. దీంతో జనం తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్కు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ విడిగా కాకుండా కట్టల ప్రకారం కొత్తిమీర విక్రయిస్తుండగా... అవసరం లేకపోయినా రూ.40 వెచ్చించి కొత్తిమీర కొనాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
‘ఆటా’ నవలల పోటీలు
అనంతపురం కల్చరల్: ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో నవలల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు వేణు నక్షత్రం, సూర్య రాజ్కుమార్, ప్రకాష్ జయదేవ్, రాజేశ్వరరావు, ఆటా అమెరికా భారతి ఇండియా కో ఆర్డినేటర్ డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి తెలిపారు. నవల నేపథ్యం తెలుగువారిదై ఉండాలన్నారు. నవల అచ్చులో కనీసం 150 పేజీలైనా ఉండాలని సూచించారు. ఆసక్తి కల్గిన వారు హామీ పత్రాలతో atp.abeeditor@gmail.comకు తమ నవలలను జూన్ 30 లోపు పంపాలని కోరారు.


