● మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య
కళ్యాణదుర్గం: ఓటర్ల జాబితా రూపొందించడంపై కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన సర్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ రివిజన్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించి టీడీపీ నేతలు తమకు అనుకూలంగా ఉండేలా ఓటర్ల జాబితాను రూపొందించుకుంటున్నారని, ఈ విషయంగా బూత్ స్థాయిలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం జరిగిన ఐటీ, సోషల్ మీడియా విభాగాల కార్యకర్తలు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ వివిధ అనుబంధ సంఘాల గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గంలో ఎటు చూసినా కళ్యాణి వైన్స్ పేరుతో మద్యం దుకాణాలు నెలకొల్పి మద్యం ప్రియుల సొమ్ము ఖర్చు పెడుతూ సొంత నిధులు అంటూ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలపై ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేస్తుంటే అక్రమ కేసులతో భయపెడుతున్నారని మండిపడ్డారు. తిరుమలలో లడ్డూ కల్తీ పై ర్యాలీ చేస్తే తనతో పాటు మొత్తం 48 వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ పాదయాత్ర చేపట్టి, విజయోత్సవ ర్యాలీ చేస్తే అక్రమంగా 100 మందిపై కేసులు పెట్టిన ఘనత కళ్యాణదుర్గం పోలీసులకే దక్కిందన్నారు. కార్యక్రమంలో పార్టీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి నారాయణపురం వెంకటేశులు, శింగనమల యువ నాయకుడు డాక్టర్ సాకే రుత్విక్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, ఐటీ వింగ్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ మంజునాథ్ యాదవ్, సోషల్ మీడియా రాష్ట్ర జనరల్ సెక్రటరీ సలీంబాబా, ఐటీ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి, జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మంజు, తాలూకా అధ్యక్షుడు ప్రదీప్తో పాటు పలువురు పాల్గొన్నారు.


