తలుపులు మూసి.. సెల్‌ఫోన్లు లాక్కుని | - | Sakshi
Sakshi News home page

తలుపులు మూసి.. సెల్‌ఫోన్లు లాక్కుని

Nov 6 2025 7:42 AM | Updated on Nov 6 2025 7:42 AM

తలుపులు మూసి.. సెల్‌ఫోన్లు లాక్కుని

తలుపులు మూసి.. సెల్‌ఫోన్లు లాక్కుని

చిలమత్తూరు: స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ జయమ్మ, సిబ్బంది ఉదయం 11.30 గంటలకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకోవడంతోనే కార్యాలయం తలుపులు మూసి ఆ సమయంలో అక్కడున్న అందరి మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కొన్ని గంటల పాటు పలు రికార్డులు పరిశీలించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ ద్వారా వచ్చిన ఆదాయం, ఒక్కో డాక్యుమెంట్‌కు వసూలు చేసిన చార్జీల వివరాలను సేకరించారు. అనుమానిత డాక్యుమెంట్ల రికార్డుల సాఫ్ట్‌కాపీలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్‌లలో ఉన్న నగదును సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రసాద్‌ బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన ప్రజలనూ ప్రశ్నించారు. ఎందుకోసం, ఏ పని నిమిత్తం ఇక్కడికి వచ్చారని... ఆరా తీసి ప్రతి ఒక్కరి వివరాలు, ఫోన్‌ నంబరు తీసుకున్నారు. ఆ సమయంలో రవి అనే డాక్యుమెంటు రైటర్‌ కార్యాలయంలో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మీకేం పని అని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తులు డాక్యుమెంట్‌ గదిలో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. తనిఖీలు చేస్తున్న సమయంలో స్టాంపులు వేసే గదిలో రూ.2,500 వరకు నగదు లభించింది. ఆ డబ్బు విషయమై అక్కడున్న ఉద్యోగిని ప్రశ్నించగా... తనది కాదన్నారు. దీంతో ఏసీబీ అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

ముందే సమాచారం అందిందా..?

ఏసీబీ అధికారుల తనిఖీల్లో ఏమీ దొరకకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన వెంకటనారాయణ అనే సబ్‌రిజిస్ట్రారు అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతి వ్యవహారంలో ఉన్నతాధికారులు ఇటీవలే సస్పెండ్‌ చేశారు. తాత్కాలిక సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రసాద్‌ బాబు సైతం అక్రమ రిజిస్ట్రేషన్లు, పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు, సంబంధం లేని లింక్‌ డాక్యుమెంట్లు ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేయడం వంటి అంశాల్లో ఆరి తేరారని, ఇందుకోసం భారీగానే ముడుపులు తీసుకుంటారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేసినా...నగదు దొరకకపోవడంపై చూస్తే... ఏసీబీ దాడుల సమాచారం అధికారులకు ముందుగానే తెలిసిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొందరి అధికారుల ద్వారా కూటమి నేతలకు, అక్కడి నుండి సబ్‌ రిజిస్ట్రార్‌కు సమాచారం రావడంతోనే అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది.

చిలమత్తూరు సబ్‌రిజిస్ట్రార్‌

కార్యాలయంపై ఏసీబీ దాడులు

కొన్ని గంటల పాటు కొనసాగిన సోదాలు

వచ్చీరావడంతోనే కార్యాలయం తలుపులు మూసివేశారు. ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు అందరినీ కార్యాలయంలోనే నిర్బంధించి సోదాలు చేశారు. ప్రతి రికార్డూ పరిశీలించారు. కార్యాలయంలోని అణువణువూ శోధించారు. వచ్చినవారు ఏసీబీ అధికారులని తేలడంతో అటు అధికారులతో పాటు, ఇటు జనానికి ముచ్చెమటలు పట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement