హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం | - | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం

May 22 2025 12:26 AM | Updated on May 22 2025 12:26 AM

హంద్ర

హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం

‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవుదాం

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్‌ పిలుపునిచ్చారు. అనంత మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కల్గిన నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. మునిసిపాలిటీ, సర్పంచ్‌ ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువుందని, ఆ లోపు ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుద్దామన్నారు. హంద్రీ–నీవా లైనింగ్‌ పనులను తక్షణం ఆపాలని, 10 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి తీసుకెళ్లేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామన్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరించేలా పోరాడదామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అమరావతి జపం చేస్తూ.. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. విభజన హామీల్లో జిల్లాకు మంజూరైన ఎయిమ్స్‌ను గతంలో మంగళగిరికి తరలించారని, ఇప్పుడు రూ.లక్ష కోట్లతో అమరావతిని నిర్మిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వీటిపై అందరూ కలసికట్టుగా పోరాడదామన్నారు. అనంతరం సమన్వయకర్తలు మాట్లాడారు.

అనంతపురం కార్పొరేషన్‌: ‘రాయలసీమ జిల్లాలకు కల్పతరువు లాంటి హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి.. కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందికి అండగా ఉంటున్న ఆర్డీటీని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రజలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నా.. దానిపై వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది’ అని ఎంపీ, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ మిథున్‌ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలను జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్‌, సమన్వయకర్తలు రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన సమస్యలను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా డైవర్షన్‌ పాలిటిక్స్‌ మినహా ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి, లైనింగ్‌ పనులను మొదలు పెట్టారన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచేందుకు వీల్లేకుండా పోతుందన్నారు. రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 రకాల సమస్యలను తెరపైకి తెచ్చి డైవర్షన్‌ పాలిటిక్స్‌కు సీఎం చంద్రబాబు తెర లేపారన్నారు. అందులో ఏ ఒక్క దాన్నీ నిరూపించలేకపోయారన్నారు. ప్రజలు కూడా కూటమి ప్రభుత్వ దుశ్చర్యలను గమనించాలన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అరాచక పాలన చేస్తే ప్రజల నుంచి ఏదో ఒక రోజు తిరుగుబాటు మొదలవుతుందని హెచ్చరించారు.

డైవర్షన్‌ కోసమే..

ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కూటమి ప్రభుత్వం మద్యం స్కాంను తెరపైకి తెచ్చిందని మిథున్‌రెడ్డి మండిపడ్డారు. దీనికి సంబంధించి ఒక్క రూపాయి కూడా సీజ్‌ చేయలేదన్నారు. రేషన్‌ షాపులను రద్దు చేస్తామంటూ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నామన్నారు. సమావేశంలో అనంతపురం పార్లమెంట్‌ పార్టీ పరిశీలకులు నరేష్‌కుమార్‌ రెడ్డి, హిందూపురం పార్ల మెంట్‌ పార్టీ పరిశీలకులు రమేష్‌ కుమార్‌ రెడ్డి, సమన్వయకర్తలు డాక్టర్‌ సాకే శైలజానాథ్‌, వై.వెంకటరామిరెడ్డి, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మెట్టు గోవింద రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి, ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్‌ అహ్మద్‌, మాజీ మంత్రి శంకర్‌ నారాయణ, వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో–ఆర్డినేటర్‌ ఆలూరు సాంబ శివారెడ్డి, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్‌, పార్టీ పంచా యతీ రాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం

ఎంపీ, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ మిథున్‌ రెడ్డి

హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం 1
1/1

హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement