
‘సూపర్’ సేవలు మెరుగు పడాలి
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో స్పెషాలిటీ సేవలు మరింత మెరుగుపడాలని సంబంధిత వైద్యాధికారులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం సూచించారు. మంగళవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. రోగులకందుతున్న సేవలు, రోజూ ఎన్ని శస్త్రచిక్సితలు చేస్తున్నారు, తదితర అంశాలపై ఆరా తీశారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆ దిశగా వారిలో నమ్మకం కల్గించేలా చూడాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులు వేగవంతం చేసి త్వరలో అందుబాటులో తీసుకురావాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల వైద్యులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రధానంగా సమయపాలన పాటించాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం బోధనాస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు వినతి పత్రం అందించారు. పరికరాలు, ప్రత్యేక బడ్జెట్ను కేటాయించేలా చూడాలని కోరారు.
వ్యక్తిపై కేసు నమోదు
గార్లదిన్నె: ప్రధాని నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... కల్లూరుకు చెందిన మహబూబ్బాషా సోషల్ మీడియాలో దేశ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టాడన్నారు. దీనిపై ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
రేషనలైజేషన్తో తీవ్రంగా నష్టపోతున్నాం
అనంతపురం అర్బన్: ప్రభుత్వం చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా తీవ్రంగా నష్టపోతామని సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ వి.వినోద్కుమార్ను మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ వద్ద అసోషియేషన్ ఆఫ్ సెక్రటరీయేట్ రాష్ట్ర అధ్యక్షుడు సల్మాన్ బాషా, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మైలారప్ప, పవన్కుమార్, ఉపాధ్యక్షుడు అఖిల్కుమార్, తదితరులు కలిసి వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అన్ని శాఖల్లో విలీనం చేసి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని ప్రభుత్వం చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా చాలా నష్టపోతామన్నారు. ఈ ప్రక్రియలో రెండు లేదా మూడు సచివాలయాలను క్లస్టర్గా చేస్తున్నారన్నారు. దీంతో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, మైనర్ ఇరిగేషన్, పంచాయతీ ఇలా అన్ని శాఖల పనులు ఒకేసారి చేయాల్సి వస్తుందన్నారు. దీంతో ఒత్తిడి పెరిగి పనిలో నాణ్యత లోపిస్తుందన్నారు. ఈ క్రమంలో చోటు చేసుకునే తప్పిదాలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు బాధ్యులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు శ్రీకాంత్, కులశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విచారణకు 33 మంది ఎల్టీల హాజరు
అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాల(జీఎంసీ)లో ల్యాబ్ టెక్నీషియన్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం చేపట్టారు. బోధనాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 35 మందికి గాను 33 మంది హాజరయ్యారు. విచారణ కమిటీ సభ్యులుగా డాక్టర శ్యామ్, డాక్టర్ రామస్వామి, డాక్టర్ ఆది నటేష్ వ్యవహరించారు.

‘సూపర్’ సేవలు మెరుగు పడాలి

‘సూపర్’ సేవలు మెరుగు పడాలి