
రామగిరి ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా
రామగిరి: రామగిరి ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సభ్యులు రానందున వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి సంజీవయ్య ప్రకటించారు. గత ఎన్నికల్లో మొత్తం 10మంది ఎంపీటీసీ సబ్యులుండగా ఇందులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు తొమ్మిది మంది, ఒకరు టీడీపీ సభ్యుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ సభ్యులతో ఎంపీపీ స్థానాన్ని అప్పట్లో వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. మూడు నెలలక్రితం అప్పటి ఎంపీపీ మీనుగ నాగమ్మ అనారోగ్యంతో మృతిచెందగా ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఏడాది మార్చి 27న ఎన్నిక జరపాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంలో అధికారులు ఎన్నిక ప్రక్రియ మొదలు పెట్టారు. అనివార్య కారణాలతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో మరుసటి రోజు (మార్చి 28)కు ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు రామగిరిలో జరిగే ఎన్నిక ప్రక్రియకు హాజరవుతుండడంతో మార్గమధ్యంలోనే పెనుకొండలో పేరూరు2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని టీడీపీ మూకలు బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని ఎన్నిక వాయిదా పడ్డానికి కారణమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంపీపీ ఎన్నికకు టీడీపీకి బలం లేకున్నా ఆ పార్టీ నాయకులు ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి లోబర్చుకున్నారు. దీంతో ఆరుగురు సభ్యులున్న వైఎస్సార్సీపీకి ఎంపీపీ స్థానం లాంఛనమే అవుతుంది. ఇది జీర్ణించుకోలేని పరిటాల కుటుంబం రామగిరిలో తమ మాటే జరగాలంటూ సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తూ ఎన్నిక వాయిదా పడ్డానికి కారణమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
రామగిరి వైస్ సర్పంచ్పై
రౌడీషీటర్ దాడి..
రామగిరి ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో రామగిరి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ బోయ రామాంజినేయులపై రౌడీషీటర్ శివకుమార్ తన అనుచరులతో కలసి సోమవారం దాడి చేశాడు. టీ తాగేందుకని ఓ హోటల్కు వెళ్లగా సమీపంలో ఉన్న 20 నుంచి 30 మంది టీడీపీ శేణులు ఒక్క సారిగా శివకుమార్ ఆధ్వర్యంలో రామంజినేయులను చుట్టముట్టారు. ‘‘ఇక్కడ నీకేం పని’’ అని ప్రశ్నిస్తూ రామాంజినేయులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రామగిరిలో టీడీపీ మూకలు హల్చల్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయగా, పోలీసు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు.
పోలీసుల అత్యుత్సాహం
ఎంపీపీ ఎన్నిక జరిగే సమయంలో ఎంపీటీసీ సభ్యులతోపాటు ఎన్నికల అధికారులు, మీడియా సిబ్బంది మాత్రమే హాలులోకి అనుమతి ఉంది. పోలీసులు సైతం ఎన్నిక గది బయటే విధులు నిర్వర్తించాలి. అయితే ఎన్నికల నియమావళిని అధికారులు తుంగలోతొక్కి ఏకంగా ఎన్నిక జరిగే గదిలోకి ప్రవేశించి వీడియోలు తీయడం చర్చనీయాంశగా మారింది. అంతేకాక వివాదాస్పద రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పదే పదే పోలీసులకు సలహాలు, సూచనలిస్తూ హడావుడి చేయడం గమనార్హం.

రామగిరి ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా

రామగిరి ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా