
ఆ 10 ఎకరాలపై స్టేటస్కో
రాప్తాడురూరల్: ‘హైకోర్టు ఆదేశాలు’ అంటూ అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురం పంచాయతీ పాపంపేట సర్వే నంబరు 106–1లోని 68 సెంట్లలో పెద్దపెద్ద భవనాలను రెవెన్యూ అధికారులు ఇటీవల తొలగించారు. ఈ వ్యవహారంపై శ్రీ విద్యారణ్య గురుకుల వైదిక పాఠశాల సంఘం అధ్యక్షుడు పట్నం శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ, పోలీసు అధికారులు భవనాలను తొలగించారంటూ పేర్కొన్నారు. రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్, రూరల్ పీఎస్ ఎస్హెచ్ఓ, జీఎల్ఎన్ శ్రావణ్కుమార్, జి. హరిప్రసాద్, జి.నరేంద్రబాబు, జి.రమాశంకర్ను ప్రతివాదులుగా చేర్చారు. 68 సెంట్లు కాదు...106–1 సర్వేనంబరులో 4.86 ఎకరాలు, 106–2 సర్వే నంబరులో 4.20 ఎకరాలు, 119–1, 119–2 సర్వే నంబర్లలో 94 సెంట్లు కలిపి మొత్తం 10 ఎకరాలు తమదేనని పిటీషనర్ పేర్కొన్నారు. దీనిపై వాదోపవాదనలు విన్న తర్వాత నాలుగు రోజుల క్రితం హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. 10 ఎకరాలపై స్టేటస్కో ఇచ్చింది. ఈ క్రమంలో బాధితులు సదరు భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
అక్రమంగా తొలగించారు..
106–1 సర్వే నంబరులోని ఇళ్లను రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమంగా తొలగించారంటూ బాధితులు వాపోతున్నారు. జీఎల్ఎన్ శ్రావణ్కుమార్, జి. హరిప్రసాద్, జి.నరేంద్రబాబు, జి.రమాశంకర్ వేసిన పిటీషన్పై అనంతపురం మునిసిపాలిటీ పరిధిలోని 106–1 సర్వే నంబరులో సర్వే చేసి 68 సెంట్ల స్థలాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలంటూ 2024 డిసెంబరు 5న తీర్పు ఇచ్చిందన్నారు. దీన్ని పట్టుకుని రెవెన్యూ, పోలీసు అధికారులు దౌర్జన్యంగా సంబంధం లేని రూరల్ పరిధిలోని పాపంపేట పొలంలోని 106–1 సర్వే నంబరులోని 68 సెంట్లలో ఇళ్లను కూల్చివేశారన్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
భాగపరిష్కారాల్లోనూ చూపలేదు..
పైన పేర్కొన్న నాలుగు సర్వే నంబర్లలో 10 ఎకరాలను శ్రీ విద్యారణ్య గురుకుల వైదిక పాఠశాల సంఘం, శ్రీ హంపి విద్యారణ్య శంకర భారతి బ్రాహ్మణ వైదిక సంఘం రెండింటీకీ 5 ఎకరాల చొప్పున 1949లో ఆ భూమి హక్కుదారులైన రాచూరి, కొండపల్లి కుటుంబాలు దానవిక్రయం చేశాయి. ఈ భూమిలో మూడోవంతు రాచూరి కుటుంబానికి, ఒకటోవంతు కొండపల్లి కుటుంబానికి భాగాలుండేవి. ఈ రెండు కుటుంబాలు 1952లో భాగపరిష్కారాలు చేసుకున్నాయి. దాన విక్రయం చేసిన 10 ఎకరాల భూమి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. 1962లో గొల్లపల్లి కుటుంబ సభ్యులు భాగ పరిష్కారం చేసుకున్నారు. ఇందులోనూ 10 ఎకరాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని చెబుతున్నారు.
న్యాయం గెలిచింది
హైకోర్టు తీర్పు ఒకటిస్తే ఇక్కడి అధికారులు మరొకటి అమలు చేసి మాకు అన్యాయం చేశారు. అనంతపురం మునిసిపాలిటీ పరిధిలోని 106–1 సర్వే నంబరులోని భూమి గుర్తించాలని స్పష్టంగా చెప్పినా... పోలీసు, రెవెన్యూ అధికారులు బలవంతంగా మా ఇళ్లను తొలగించారు. ఇంట్లో సామాన్లు కూడా ఎత్తుకెళ్లారు. పైగా మానాన్న, మేము కబ్జా చేశామని ఆర్డీఓ పదేపదే అన్నారు. ఏ ఆధారాలతో అన్నారో ఆయనకే తెలియాలి. అధికారులు కబ్జాదారులకు అండగా నిలిచారు. ఈ ఆధారాలను హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ఉంచాం. చివరకు న్యాయమే గెలిచింది. నాలుగు సర్వే నంబర్లలో పది ఎకరాలు మాకే చెందుతుందని తీర్పు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ కేవియట్ వేశా. – పట్నం శివప్రసాద్
విద్యారణ్య నగర్లో ఇళ్ల నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
106–1, 106–2, 119–1, 119–2
సర్వే నంబర్లలో 10 ఎకరాలపై స్టేటస్కో
హెచ్చరిక బోర్డు నాటిన బాధితులు

ఆ 10 ఎకరాలపై స్టేటస్కో

ఆ 10 ఎకరాలపై స్టేటస్కో