
అడ్డగోలు నియామకాలకు అడ్డుకట్ట
అనంతపురం ఎడ్యుకేషన్: పూర్వ జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మీ నిర్వాకం.... సమగ్రశిక్ష కార్యాలయాన్ని నేటికీ వెంటాడుతోంది. కమిషనర్ ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ తీసుకున్న అడ్డగోలు నిర్ణయాన్ని ఉన్నతాధికారులు తప్పుపట్టారు. ఈ క్రమంలో సెక్టోరియల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేశారు. తాజాగా వేసవిసెలవుల్లో నోటిఫికేషన్ జారీ చేసి 15 రోజుల్లోగా భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో నేడో, రేపో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
అసలేం జరిగిందంటే...
సమగ్ర శిక్షలో సెక్టోరియల్ అధికారులుగా ఎవరినైనా తీసుకోవాలన్నా... ఉన్నవారిని తప్పించాలన్నా విద్యా సంవత్సరం మధ్యలో కాకుండా వేసవి సెలవుల్లో చర్యలు తీసుకోవాలని స్వయంగా విద్యాశాఖ కమిషనర్ గతంలో స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, అప్పటి డీఈఓ, ఏపీసీలు అస్మదీయుల కోసం అడ్డగోలు నిర్ణయం తీసుకుని ఏపీఓను తప్ప తక్కిన సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులందరినీ ఒకేసారి 2024 జూలై 31న రిలీవ్ చేయించారు. రాష్ట్రంలో తక్కిన 25 జిల్లాల్లో ఎక్కడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఆగమేఘాల మీద ఆగస్టు 1న కొత్తవారిని తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎక్కడా తన చేతికి మట్టి అంటకుండా కలెక్టర్నే బురిడీ కొట్టించి ఆయనతోనే సంతకాలు చేయించారు. చివరకు సమగ్ర శిక్షలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ను రిప్యాట్రేషన్ అధికారం ఏపీసీకే ఉంటుంది. ఇదికూడా కలెక్టర్తోనే చేయించారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు చేపట్టారు. కలెక్టర్తో ఆమోద ముద్ర వేయించి కమిషనర్ ఆమోదం కోసం జాబితాను పంపారు.
ఐదుగురి పేర్లు పంపితే నలుగురికి గ్రీన్ సిగ్నల్..
రాష్ట్ర అధికారులకు పంపిన ఐదుగురి జాబితాలో నలుగురి నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎంఓగా ఆనందభాస్కర్రెడ్డి, జీసీడీఓగా కవిత, అలెస్కోగా గురుమునికృష్ణ, అసిస్టెంట్ ఏఎంఓ (జనరల్)గా ఫణిరాజు నియామకాలకు ఆమోదం తెలిపారు. అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) పోస్టుకు తీవ్రంగా ప్రయత్నం చేసిన రామగిరి కిష్టప్ప, జీసీడీఓ, మరో అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారి పోస్టుకు తీవ్రంగా ప్రయత్నం చేసిన వారి పేర్లు జాబితాలో లేకపోయేసరికి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఎవరికివారు ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు చేయడంతో ఈ ప్రక్రియ అంతటితో ఆగిపోయింది.
ఎస్జీటీలూ అర్హులే
సమగ్ర శిక్ష పరిధిలోని సెక్టోరియల్ అధికారుల పోస్టులకు గతంలో హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే అర్హులు. ఆ తర్వాత కేవలం స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే అర్హులని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా మరో రకంగా ఆదేశాలిచ్చారు. ఇందులో ఎస్జీటీలు కూడా అర్హులేనని స్పష్టం చేశారు.
‘సమగ్ర’లో ముగ్గురి రీప్యాట్రేషన్
సమగ్రశిక్షలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ అసిస్టెంట్ను విద్యాశాఖకు రీప్యాట్రేషన్ చేశారు. ఈ మేరకు ఏపీసీ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్లు షబానా, మధుసూదన్రావు, జూనియర్ అసిస్టెంట్ బాల కుళ్లాయప్పను మాతృశాఖకు పంపారు. విధుల్లో అలసత్వం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లను గతంలో డీఈఓగా పని చేసిన వరలక్ష్మి అదేపనిగా ఇక్కడికి పంపారు. ఇక్కడ పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్కు లబ్ధి కల్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం ఉంది. ఇక్కడ ఇద్దరు ఉద్యోగులు ఉన్నా...వారి నుంచి ఎలాంటి పనులూ చేయించుకోలేకపోతున్నామని ఏపీసీ పలుమార్లు డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా వారిని రీప్యాట్రేషన్ చేశారు.
సమగ్రశిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ల నోటిఫికేషన్ రద్దు
కమిషనర్ ఉత్తర్వులు
పూర్వపు డీఈఓ నిర్వాకంతో విద్యా సంవత్సరం మధ్యలోనే సెక్టోరియల్ ఆఫీసర్లు రిలీవ్
కొత్తగా తీసుకునేందుకు
హడావుడి నోటిఫికేషన్