
‘ఏపీఎఫ్ఆర్’ నమోదు తప్పనిసరి
● ప్రతి రైతు పేర్లూ నమోదు చేయండి
● జేడీఏ ఉమామహేశ్వరమ్మ
గుత్తి రూరల్: ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన ప్రతి రైతూ తన పేరును ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్ఆర్) పోర్టల్లో నమోదు చేయాలని వ్యవసాయాధికారులను ఆ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. గుత్తిలోని జీవనోపాధుల వనరుల కేంద్రం (సీఎల్ఆర్సీ)లో బుధవారం 2025 ఖరీఫ్ సాగుకు సమాయత్తంపై గుత్తి డివిజన్లోని పామిడి, యాడికి, పెద్దవడుగూరు, గుత్తి, శింగనమల మండలాల వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏ, ఎంపీఈఓలతో ఆమె సమావేశమై మాట్లాడారు. రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల అందజేతపై అవగాహన పెంచాలన్నారు. ఖరీఫ్ 2025 సీజన్లో కౌలు రైతులకు కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో లభించే ఎరువుల లభ్యతపై రైతులను చైతన్య పరిచి, సకాలంలో వాటిని అందించాలన్నారు. కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించిన యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో వ్యవసాయ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో గుత్తి ఏడీఏ వెంకట్రాముడు, జేడీఏ కార్యాలయ సాంకేతిక వ్యవసాయాధికారులు వెంకటకుమార్, బాలానాయక్, వ్యవసాయాధికారులు ముస్తాక్ అహమ్మద్, లీనా వసుంధర పాల్గొన్నారు.