
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. బుధవారం అనంతపురంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో బిజినెస్ మేనేజర్ విజయభాస్కర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ, అమ్మకాలు మరింత పెరగాలని సూచించారు. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.6.78 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగాయన్నారు. ఈ ఏడాది రూ.20 కోట్లు టర్నోవర్ లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. యూరియా, డీఏపీ, ఇతరత్రా ఎరువులకు డిమాండ్ ఉన్నందున వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్ ద్వారా తగినంత ఎరువులు సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ తోపుదుర్తి ఆత్మా రామిరెడ్డి, డైరెక్టర్లు వై.జనార్దన్రెడ్డి, బి.శ్రీరామరెడ్డి, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ సత్యనారాయణరెడ్డి, అకౌంట్స్ మేనేజర్ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొర్రపాడు పీహెచ్సీకి
జాతీయస్థాయి గుర్తింపు
బుక్కరాయసముద్రం: కొర్రపాడు పీహెచ్సీకి జాతీయస్థాయి గుర్తింపు లభించిందని డాక్టర్ హర్ష తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్యూఎస్) బృందం పీహెచ్సీని సందర్శించింది. ఇక్కడ ఉన్న అన్ని విభాగాలూ 89.19 శాతం క్వాలిటీ సాధించినందున కొర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారులకు, పీహెచ్సీ సిబ్బందికి డాక్టర్ శ్రీహర్ష, ఫ్యామిలీ డాక్టర్ వినోద్, జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ బృందం సభ్యుడు స్టీఫెన్ బుధవారం కృతజ్ఞతలు తెలిపారు.
79 సిలిండర్లు సీజ్
అనంతపురం అర్బన్: పౌర సరఫరాల అధికారులు బృందాలుగా ఏర్పడి బుధవారం నగరంలోని పలు ధాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ (డొమెస్టిక్)ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండటాన్ని గుర్తించారు. 79 సిలిండర్లను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై 6(ఏ) కేసులు నమోదు చేశారు. జిల్లా సరఫరాల అధికారి (డీఎస్ఓ) శోభారాణి మాట్లాడుతూ గృహావసర వంట(డొమెస్టిక్)గ్యాస్ను వాణిజ్య అవసరాలకు వినియోగించడం ఎల్పీజీ కంట్రోల్ ఆర్డర్–2000 ప్రకారం నేరమన్నారు. జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు (సీఎస్డీటీ) దుర్గాప్రసాద్, జ్యోతి, కంబక్క, బీఎం బాషా, రాజశేఖర్, హరిప్రియ, రాజా, లక్ష్మీదేవి, ఇంతియాజ్, రామ కృష్ణారెడ్డి, అన్సార్ ఆలమ్, ప్రతిమ, ఎల్పీజీ సేల్స్ అఫీసర్లు అనంతరామరావు, రావిమోహన్రెడ్డి బృందాలుగా ఏర్పడి నగరంలోని వివిధ చోట్ల ధాబాలు, హోటళ్లు, టీస్టాళ్లు, ప్రైవేటు హాస్టళ్లు, టీస్టాళ్లపై దాడులు నిర్వహించారన్నారు.
పాలిటెక్నిక్ సీట్లకు
స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం: అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అక్టోబర్ మూడో తేదీన మధ్యాహ్నం 2 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సి.జయచంద్రారెడ్డి తెలిపారు. స్పాట్ అడ్మిషన్లో చేరే విద్యార్థులు ప్రభుత్వ స్కాలర్ షిప్కు (విద్యాదీవెన, వసతి దీవెన వంటి) అర్హులుకారు. స్పాట్ అడ్మిషన్లకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని హాజరు కావాలని సూచించారు. పాలిసెట్–2023 ఉత్తిర్ణులై ర్యాంక్ సాధించిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్ పొందాలనుకునేవారు ఏ ఇతర పాలిటెక్నిక్ కళాశాలలోనూ చేరి ఉండకూడదన్నారు.

సీజ్ చేసిన సిలిండర్లతో అధికారులు

మాట్లాడుతున్న తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి