
విపత్తుల నివారణపై ప్రత్యేక చర్యలు
అనకాపల్లి: అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతమైన ప్రతిస్పందన ద్వారా ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని, విపత్తుల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం జిల్లాలో పోలీస్శాఖ అఽధికారులతో విపత్తులపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తదితర ప్రమాదాలు సంభవించిన సమయంలో దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బంది తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగహన కల్పించినట్టు చెప్పారు. విపత్తులు సంభవించిన సమయంలో పోలీసు అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) ప్రకారం సమన్వయంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాల తీవ్రత ఆధారంగా విధులు కేటాయిస్తూ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ సహకారంతో అచ్యుతాపురం, పరవాడలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. విపత్తులను ఎదుర్కోడానికి అగ్నిమాపక శాఖ, వైద్య బృందాలు, ఎస్డీఆర్ఎఫ్/ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసు లు సమష్టిగా కృషిచేయాలన్నారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సహకారంతో సీఎస్ఆర్ నిధులతో పోలీసులకు అత్యాధునిక ఫైర్ సేఫ్టీ పరికరాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్, ట్రైనీ డీఎస్పీ ఎం.వి.కె.చైతన్య, సీఐలు పాల్గొన్నారు.
ఎస్సీ తుహిన్ సిన్హా