
రెండో బిడ్డను చూడకుండానే అనంత లోకాలకు..
● ఎల్బీ పురం పామాయిల్ ఫ్యాక్టరీలో విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి ● పరిహారం కోసం మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన ● రూ.28 లక్షలు, ప్రతి నెలా జీతం చెల్లింపునకు యాజమాన్యం అంగీకారం
బుచ్చెయ్యపేట: మండలంలోని ఎల్బీ పురం పామాయిల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుడు పల్లా అప్పన్న(30) విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. అప్పన్న ఎప్పటిలాగే బుధవారం తోటి కార్మికులతో కలిసి ఫ్యాక్టరీలో విధులకు వచ్చాడు. మధ్యాహ్నం భోజన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న తాటిచెట్టు కాయలను గొల్ల కత్తితో కోస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు కత్తి తగిలింది. పామాయిల్ గెలలు కోసే పొడవాటి ఇనుప కత్తి కావడంతో అప్పన్న విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే ఆయన్ను వడ్డాది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి చోడవరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దీంతో అప్పన్న మృతదేహాన్ని తిరిగి పామాయిల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి యాజమాన్యం తమను ఆదుకోవాలంటూ అప్పన్న కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాత్రి వరకు బాధిత కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీలోనే అప్పన్న మృతదేహంతో ఆందోళన చేశారు. రూ.25 లక్షల పరిహారం, మరో 30 ఏళ్ల పాటు మృతుడి కుటుంబానికి జీతం అందిస్తామని యాజమాన్యం తెలపగా.. బాధిత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఫ్యాక్టరీ యయజమాని విజయ్మిట్టల్ వచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని, కోటి రూపాయలు అందించాలని ఆందోళనకు దిగి నినాదాలు చేశారు. చివరకు రూ.28 లక్షలు పరిహారం, 30 ఏళ్ల పాటు ప్రతి నెలా కంపెనీ నుంచి జీతం చెల్లించేందుకు, ఇన్సూరెన్స్, ఇతర అలవెన్స్ వచ్చేలా చేస్తామని యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు.
మృతుని భార్య 8వ నెల గర్భిణి
మృతుడు భార్య రేవతి 8వ నెల గర్భిణి. వీరికి పెళ్లై రెండేళ్లు కాగా.. ఏడాదిన్నర బాబు ఉన్నాడు. మంగళవారం అప్పన్న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించాడు. కొద్ది రోజుల్లో భార్య రెండో బిడ్డకు జన్మనిస్తుందన్న సంతోషంలో ఉన్నాడు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. విద్యుత్ రూపంలో అప్పన్న మృతి చెందడంతో రేవతి కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు, తన బిడ్డలకు దిక్కెవరంటూ రోదించింది. మృతుని తండ్రి గతంలోనే మృతి చెందగా.. భార్య, తల్లి ఆయనపై ఆధారపడి జీవిస్తున్నారు. చోడవరం సీఐ అప్పలరాజు, అదనపు ఎస్ఐ భాస్కరరావు వచ్చి యాజమాన్యం, బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు.

రెండో బిడ్డను చూడకుండానే అనంత లోకాలకు..