
జి.భీమవరంలో కేంద్ర నిధులతో వృద్ధాశ్రమం
కశింకోట: మండలంలో జి.భీమవరంలో ఉన్న వృద్ధాశ్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా శుక్రవారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు చేశారు. పావని సొసైటీ ఫర్ ది మల్టీపుల్ హ్యాండీ క్యాప్డ్ అండ్ స్పాస్టిక్స్ సంస్థ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ఈ ఆశ్రమం కొనసాగుతోంది. ఇక నుంచి ఈ ఆశ్రమం కేంద్రం నిధులతో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నిర్వహించనుంది. ఈ ఆశ్రమంతో పాటు తమిళనాడులో వేలూరు, నాగాలాండ్, మరో రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఇందుకు సన్నాహాలు చేశామని, ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు బి.ఆశయ్య గురువారం విలేకరులకు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు ఎ.రవిప్రకాష్రెడ్డి, కలెక్టర్ విజయ కృష్ణన్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ల దినోత్సవాన్ని నిర్వహించి, ‘ఏజింగ్ విత్ డిగ్నిటీ’అనే ప్రత్యేక కార్యక్రమం న్యూఢిల్లీలో రాష్ట్రపతి సమక్షంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఎల్ఈడీ స్క్రీన్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. వర్చువల్గా రాష్ట్రపతితో మమేకం కావడానికి ఇక్కడ వయోవృద్ధులు రిహార్సల్స్ చేశారు. వృద్ధాశ్రమంలో 25 మంది నివాసం ఉండి సేవలు పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆశ్రమం కార్యదర్శి ఎం.సత్యవాణి ‘సాక్షి’కి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనాథలు, పాక్షిక అనాథలు, ఆర్థికంగా వెనుకబడిన వారు, కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలకు దూరమైన వారిని ఆశ్రమంలో చేర్చుకున్నామన్నారు.
న్యూఢిల్లీ నుంచి నేడు వర్చువల్గా ప్రారంభించనున్న రాష్ట్రపత్రి ముర్ము

జి.భీమవరంలో కేంద్ర నిధులతో వృద్ధాశ్రమం