
ప్రత్యేక డీఎస్సీ కోసం ముట్టడి
సాక్షి,పాడేరు: ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగుల నినాదాలతో జిల్లాలో ఐటీడీఏ కార్యాలయాల ప్రాంగణాలు హోరెత్తాయి. జీవో నంబర్ 3 పునరుద్ధరించాలని, ప్రత్యేక డీఎస్సీ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ,ఆదివాసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాల నాయకులు, నిరుద్యోగ యువకులు పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలను బుధవారం పెద్ద ఎత్తున ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్ది సేపు రోడ్లపై బైఠాయించారు. పాడేరులో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. అంతకుముందు పాడేరు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వినతిపత్రం ఇచ్చేందుకు పాడేరులో ఐటీడీఏ కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వారంతా రోడ్డుపైనే బైఠాయించారు. నూరుశాతం ఉద్యోగాల జీవోతో పాటు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావుకు డీఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేసి, ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలని కోరారు.
మే 2 నుంచి నిరవధిక మన్యం బంద్
పత్యేక డీఎస్సీ ప్రకటించి, ఆదివాసీలకు న్యాయం చేసేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని, మే 2 నుంచి నిరవధిక మన్యం బంద్ నిర్వహిస్తామని ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో అనంతగిరి జెడ్పీటీసీ డి.గంగరాజు, డీఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు కుడుముల కాంతారావు, పి.అప్పలనర్స, ఎస్.మాణిక్యం,కూడా సుబ్రహ్మణ్యం, కూడా రాధాకృష్ణ, ధర్మాన పడాల్, పి.బాలదేవ్, సురేంద్ర, హైమావతి, వల్లా సలీం, వంతాల నాగేశ్వరరావు, దాస్, సింహాద్రి, డి.పి.శంకర్, టి.కృష్ణారావు, జీవన్, కార్తీక్, ఎస్.కొండలరావు, బి.కేజీయారాణి, చిన్నస్వామి, చిన్నారి, చిరంజీవి, ప్రశాంత్కుమార్, బాలరాజు, లక్ష్మణరావు, మత్స్యరాస వెంకటరాజు, పిట్ట నరేష్తో పాటు పలు ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
రంపచోడవరం: సీఐటీయూ, ఏపీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి నిరసన ప్రదర్శన నిర్వహించి ఐటీడీఏ ఎదుట బైఠాయించారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం అధ్యక్షుడు లోతా రామారావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అరకులోయలో ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని, నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే వర్తించేలా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు
వినతిపత్రం ఇచ్చేందుకు బయటకు రావాలని గిరిజన సంఘాలు కోరగా, బయటకు రావడానికి ఐటీడీఏ పీవో ఆసక్తి చూపలేదు. దీంతో ఐటీడీఏ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసు లు అడ్డుకున్నారు. ఈ సమయంలో గిరిజనులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన గిరిజన యువత రోడ్డుపై బైఠాయించడంతో మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. కొద్ది సేపటి తర్వాత పీవో కట్టా సింహాచలం బయటకు రావడంతో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వెదుళ్లు లచ్చిరెడ్డి,ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు తీగల బాబురావు, సీపీఎం నాయకులు మట్ల వాణిశ్రీ, సిరిమల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చింతూరు: స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల నాయకులు, నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు స్థానిక ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. జీవో నంబర్ 3 పై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఉన్నత చదువుల్లో అడుగుపెడుతున్న ఆదివాసీ యువత జీవోల రద్దు కారణంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఓట్లకోసం జీవోను పునరుద్ధరిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించడం తగదని, ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి ఆదివాసీ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ కోసం ఈనెల రెండున నిర్వహిస్తున్న మన్యం బంద్ను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం వారు ఐటీడీఏ పీవో అపూర్వభరత్కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్కుమార్, సున్నం రాజులు, సీసం సురేష్, పల్లపు వెంకట్, మడివి రవితేజ, అగరం సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మూడు ఐటీడీఏల వద్ద ఆదివాసీ డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ ప్రజా సంఘాల ఆందోళన
నూరుశాతం ఉద్యోగాల జీవోను వెంటనే తేవాలని డిమాండ్