దేవరాపల్లి: అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దేవరాపల్లికి చెందిన డి.వెంకన్న ఎన్నికయ్యారు. అమలాపురంలో ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నట్లు వెంకన్న బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, వృత్తిదార్లు, సన్న,చిన్నకారు రైతులు పాల్గొన్న ఈ మహాసభలో పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు తీర్మానాలు చేశామన్నారు. దళితులపై దాడులు, కుల వివక్షను అరికట్టాలని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినట్టు చెప్పారు. దళితులు, గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని వెంకన్న విమర్శించారు. క్రైస్తవ మతం తీసుకున్న దళితులను ఎస్సీలు కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని వారి సర్టిఫికెట్లను రద్దు చేయించాలని చూస్తుండటాన్ని మహాసభలో తీవ్రంగా ఖండించినట్టు చెప్పారు.ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.


