పాడేరు రూరల్: పసుపు పంటలో అధిక దిగుబడి సాధించాలంటే రైతులకు సాగు పద్ధతులపై పూర్తి అవగాహన ఉండాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని వంట్లమామిడి పంచాయతీ చోడిపల్లి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పసుపు విత్తనాలు నాటే ముందే నాణ్యతను పరిశీలించుకోవాలని సూచించారు. మొక్కలకు వచ్చే వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువుల వినియోగానికే రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. నూతన సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని, కొత్త రకం వంగడాలను సాగు చేయాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డ్ ఫీల్డ్ అధికారి కళ్యాణి, ఉద్యాన అధికారి శరణ్య మాధురి, రైతులు పాల్గొన్నారు.
పసుపు రైతులకు ఏరువాక శాస్త్రవేత్త
ప్రదీప్ కుమార్ సూచన


