జి.మాడుగుల: వైఎస్సార్సీపీ యువజన విభాగం కర్నూలు సిటీ అధ్యక్షుడు బాలుపై జరుగుతున్న అక్రమ అరెస్టులు, పోలీసు వేధింపులను నిరసిస్తూ బుధవారం జి.మాడుగులలో మండల వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, పోలీసు వేధింపులతో ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు త్రీటౌన్ పోలీసులు బాలును నిరంతరం వేధిస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు ఎస్.మహేష్, బి.రవి, జి.శ్రీను పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ యువజన విభాగం డిమాండ్


