పాడేరు: జిల్లాలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని కొత్త పాడేరు గ్రామంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు నూతనంగా నిర్మించిన నివాస గృహంతో పాటు పార్టీ జిల్లా కార్యాలయాన్ని మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఒకే ప్రాంగణంలో నివాస గృహాన్ని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం శుభపరిణామన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ మరింత సేవ చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అతిథులను ఘనంగా సన్మానించి, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ విప్ కరణం ధర్మశ్రీ, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, జీసీసీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు.
అత్యధిక స్థానాలు కై వసంచేసుకునేందుకు కృషి
వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు
పాడేరులో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం


