రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్ల దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం వందవ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎటువంటి పరిహారం ఇవ్వకుండా దళిత రైతులకు చెందిన డీ పట్టా భూములను లాక్కొనేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు.దళితులు దీక్షలు చేపట్టి వంద రోజులైనా కూటమి నేతలు పట్టనట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు.నిరుపేదలైన దళితుల భూముల్ని లాక్కొంటున్న ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వేలాది ఎకరాలకు దోచిపెడుతోందని విమర్శించారు.పంచదార్ల రైతులకోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.అనంతరం దీక్ష శిబిరం వద్ద పలువురు దళిత సంఘాలు,విదసం నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐడీ బాబు,జి.దేముడు నాయుడు,చందక రామకృష్ణ,ధోనీ కాసియా,రేబాక రాము,ఎం.డి. రాజు,సూర్య,శివ,ఆర్ కృష్ణ,నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.


