సమావేశంలో మాట్లాడుతున్న ఆవుల శేఖర్
నర్సీపట్నం: పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు దక్కే వరకు పోరాటాలు ఆగవని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఆవుల శేఖర్ పేర్కొన్నారు. అనకాపల్లిలో జిల్లా అధ్యక్షుడు అర్జున్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో శేఖర్ మాట్లాడారు. ఏళ్ల తరబడి గ్రామీణ పేదలకు సాగు భూములు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయమని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ భూములన్నీ రాజకీయ పలుకుబడి కలిగిన వారి చేతుల్లో ఉన్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా రాష్ట్ర ప్రభుత్వం భూములు కట్టబెడుతుందన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను అమలు చేస్తే పేదలకు ఇళ్ల స్థలాలు, సాగుభూములు అందుతాయన్నారు. పేదల సంక్షేమ పథకాలు కత్తిరించాలనే గ్రామాల్లో సర్వే చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలుగుల అర్జున్రావు, బాలేపల్లి వెంకటరమణ, జిల్లా ఆఫీస్ బేరర్లు కొండలరావు, అప్పలనాయుడు, లవరాజు, బంగారయ్య, అప్పారావు, నాగేశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


