జి.మాడుగుల: మండలంలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పాడేరు గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ ఆదేశించారు. టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు స్థానిక బాలుర ఆశ్రమ పాఠశాలలో–2లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న తరగతులను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కేంద్రాలకు సబ్జెట్ టీచర్లు తప్పని సరిగా తరగతులకు హాజరయ్యే విధంగా ఆశ్రమ పాఠశాల హెచ్ఎంలు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయుల అందించే బోధనను సక్రమంగా వినియోగించుకుని ఉత్తీర్ణులు కావాలని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల హెచ్ఎం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


