సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు పాల్గొన్నారు.
● శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు.


