కై లాసగిరిపై‘త్రిశూలం’ అందాలు
ఆరిలోవ: కై లాసగిరిపై వీఎంఆర్డీఏ ఏర్పాటు చేసిన డమరుకంతో కూడిన త్రిశూలాన్ని శనివారం మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను కూడా వారు ప్రారంభించారు. ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్బాబు, లోకం మాధవి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్భరత్ పాల్గొన్నారు.
ఖర్చుపై పొంతన లేని ప్రకటనలు..
త్రిశూలం ప్రారంభోత్సవం అనంతరం ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు. త్రిశూలం నిర్మాణ వ్యయంపై ఆయన భిన్నమైన లెక్కలు చెప్పడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. గతేడాది ఆగస్టులో శంకుస్థాపన చేసిన సమయంలో దీని వ్యయం రూ.1.55 కోట్లుగా శిలాఫలకంపై పేర్కొన్నారు. అయితే, నిర్మాణం పూర్తయిన అనంతరం.. ప్రారంభోత్సవ శిలాఫలకంపై రూ.3కోట్లుగా ముద్రించారు. కానీ, ఎంపీ శ్రీభరత్ ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించడంతో అధికారులు అవాక్కయ్యారు. వాస్తవ లెక్కల కంటే రెట్టింపు ఖర్చు చేసినట్లు చెప్పడం చర్చనీయాంశమైంది.
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల దత్తత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ‘మంజునాథ్’ అనే రాయల్ బెంగాల్ టైగర్ను ఏడాది కాలానికి కమల్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ దత్తత తీసుకుంది. ఆ సంస్థ యజమాని దీపక్ కర్నాని బృందం శనివారం జూ క్యూరేటర్ జి.మంగమ్మను కలిసి, పులి వార్షిక నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.54,000ల చెక్కును అందజేశారు. అనంతరం పులి ఎన్క్లోజర్ వద్ద క్యూరేటర్ ఇతర అధికారులతో కలిసి దాతలకు దత్తత పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా క్యూరేటర్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. దత్తత తీసుకున్న సంస్థ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బృందం సభ్యులు బి.భానువెంకట ప్రతాప్, ఉదయ కిరణ్, జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, జూ వైద్యుడు డాక్టర్ భాను తదితరులు పాల్గొన్నారు.


