కె.కోటపాడు: మండలంలోని పైడంపేటలో శనివారం ఉదయం జామి ఈశ్వరరావు, జామి హరికృష్ణ ఇళ్లలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో గల డోర్కర్టెన్స్కు, ఇంటి దూలాలకు మంటలు వ్యాపించాయి. అదుపు చేసేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇళ్లలో గల దుస్తులు, నిత్యావసర సరుకులు, బంగారం, నగదు, ధాన్యం కాలిబూడిదయ్యాయని బాధితులు హరికృష్ణ, ఈశ్వరరావు తెలిపారు. స్థానికుల సమచారంమేరకు చోడవరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
డి.గొటివాడలో...
మాడుగుల: మండలంలో డి.గొటివాడలో వంట గ్యాస్ లీక్ అవడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు సమాచారం మేరకు వివరాలు... శుక్రవారం రాత్రి గ్యాస్ స్విచ్ ఆఫ్చేయకుండా గ్రామానికి చెందిన చుక్కల జగ్గారావు నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున టీ పెట్టడానికి గ్యాస్ వెలిగించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇంటిలో సామగ్రి దగ్ధమైంది. జగ్గారావుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు విశాఖ కేజీహెచ్కు తరలించారు.


