గాజువాక: కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఒక వ్యక్తి డయాలసిస్ కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి.. కూర్మన్నపాలేనికి చెందిన ఇందుకూరి సతీష్ (45) హెచ్పీసీఎల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడు. డయాలసిస్ చేయించుకోవడం కోసం చినగంట్యాడ జంక్షన్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడం కోసం ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. వందడుగుల రోడ్ సిగ్నల్ జంక్షన్కు వచ్చేసరికి జాతీయ రహదారిపై కుక్కలు అకస్మాత్తుగా అడ్డంగా వచ్చాయి. దీంతో సతీష్ తన ద్విచక్ర వాహనాన్ని స్లో చేశాడు. దీంతో వెనకనే వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు అతడిని బలంగా ఢీకొట్టి ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుని బావమరిది దండు గోపాల కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు సీఐ ఎస్కే హుస్సేన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


