కొయ్యూరు: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తప్పిన విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు స్పందన కరువైంది. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలను బడికి పంపాలని కోరుతున్నా విద్యార్థులు రావడం లేదు. కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 54 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన 46 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉండగా, శుక్రవారం నాటికి కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో ముగ్గురు బాలికలు ఉన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఈ తరగతులు కొనసాగుతాయని, విద్యార్థులు హాజరు కావాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం ఉండటం లేదని అక్కడి ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిని వెంటనే పాఠశాలకు పంపాలని ఆమె కోరారు.


