నాతవరం: ఈ వేసవిలో కార్టూన్లు వేద్దాం రండి అంటున్నారు ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అంబటి చంటిబాబు మాస్టారు. ఈ పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడిని జయించి, విజ్ఞానం, వినోదం, మానసిక వికాసం కోసం కార్టూన్లు దోహదపడతాయని ఆయన చెబుతున్నారు. నాతవరం మండలం చమ్మచింత ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న చంటిబాబు మాస్టారు విద్యార్థులకు వేలిముద్రలతో చిత్రాలు, కార్టూన్ల ద్వారా పలు సామాజిక విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఆసక్తి ఉన్న వారందరికీ కార్టూన్లు, వేలిముద్రల ద్వారా పలు చిత్రాలు వేయడంపై చమ్మచింతలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు ఎటువంటి ఫీజు తీసుకోవడం లేదు. పిల్లల కోసం వేలిముద్రలు చిత్రాల పుస్తకం, మనోహరం, కార్టూన్ల పుస్తకం, కార్టూన్ల శతకం రాశానని, అవి ఎంతో గుర్తింపునిచ్చాయని చంటిబాబు తెలిపారు. కార్టూన్లు గీయడం వల్ల పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీయవచ్చునన్నారు.


