నర్సీపట్నం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడియాడిన ప్రాంతాలను జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ తెలిపారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి మదుం వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లా పాండ్రంగి, పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని మంప, రాజేంద్రపాలెం, అనకాపల్లి జిల్లాలోని కృష్ణదేవిపేట ప్రాంతాలను అల్లూరి స్ఫూర్తి కేంద్రాలుగా మార్చబోతున్నామన్నారు. త్వరలో లంబసింగిలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ప్రారంభమవుతుందన్నారు. జూన్ 4న పాండ్రంగిలో భారతమాత పార్కును ప్రారంభించనున్నామన్నారు. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు బోళెం అప్పన్న దొరబాబు, నర్సీపట్నం రూరల్ అధ్యక్షుడు నిద్దర శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బోళెం శివ పాల్గొన్నారు.
గొలుగొండ: కృష్ణదేవిపేట గ్రామంలో ఉన్న అల్లూరి సమాధి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఘన నివాళులర్పించారు. అల్లూరి, గంటందొర, మల్లుదొర సమాధులకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గాదె శ్రీనివాసరావు, సునీల్రెడ్డి, సురేంద్రమోహన్, సత్యనారాయణ, సూర్యనారాయణ పాల్గొన్నారు.


